కరోనా వైరస్ వ్యవస్థలను అతలాకుతలం చేసేసింది. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం వేతనాలను లాక్ డౌన్ సమయంలో ఇచ్చారు. అయితే.. ఇప్పుడీ అంశం ఏపీలో కాస్త వివాదాస్పదం అవుతోంది. లాక్ డౌన్ రెండు కాలంలో ప్రభుత్వోద్యోగులకు 50 శాతం వేతనాలు ఇచ్చారు. ఆ సమయంలో ఉద్యోగులు కూడా పెద్దగా వ్యతిరేకత చూపించలేదు. అయితే.. 50 శాతం జీతాల్లో కోత విధించడంపై విశాఖకు చెందిన మాజీ రిటైర్డ్ న్యాయమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈమేరకు హైకోర్టు ఇటివల తీర్పు ఇచ్చింది. 12 శాతం వడ్డీతో ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు ఉద్యోగుల్లో ఆనందం నింపింది. అయితే.. ఉద్యోగ సంఘాల నాయకుడు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉద్యోగ సంఘాల నాయకులు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష కోరతాం’ అన్నారు. హైకోర్టు తీర్పు ఉద్యోగులకు అనుకూలమైనా.. ఉద్యోగుల హక్కులను కాపాడే ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడం.. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం దగ్గర పేరు తెచ్చుకునేందుకు.. సీఎం దగ్గర మార్కులు కొట్టేసేందుకే తమకు వ్యతిరేకంగా.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగ సంఘాలు వెళ్తున్నాయని అంటున్నారు. ఒకరకంగా ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతోంది. టీడీపీ హయాంలో ఇదే విధమైన పద్దతి అవలంబించారంటూ కొన్ని ఉదాహరణలపై చర్చించుకుంటున్నారు.
అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు కూడా ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఆయన నేతృత్వంలోనే కొనసాగింది. దీనిని చంద్రబాబు నాయుడే వెనకుండి నడిపించారని వార్తలు కూడా వచ్చాయి. వాటిని నిజం చేస్తూ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి అనుకూలంగానే అశోక్ బాబు నడుచుకున్నారని అంటున్నారు. అప్పటి సీఎం చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారు కాబట్టే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అంటున్నారు. ఉద్యోగుల సంక్షమం వదిలి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వారు రాజకీయంగా ఎదుగుతున్నారు. తమ స్వలాభం కోసం ఉద్యోగుల హక్కులను పణంగా పెడుతున్నారు. తెలంగాణలో శ్రీనివాస్ గౌడ్ కూడా ఉద్యోగ సంఘాల నాయకుడిగానే తెలంగాణ పోరాటానికి మద్ధతిచ్చారు. కానీ.. తర్వాత ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఉద్యోగ సంఘాల పేరుతో నాయకులు తమ లాభం చూసుకుంటున్నారనే వాదనలకు ఉదాహరణగా ఈ సంఘటనలు నిలుస్తున్నాయి.