ఏపి రాజధాని అమరావతిలో పేదల భూముల పంపిణీకి ఏపి సర్కార్ మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుగా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేర్పులు చేసేందుకు స్థానిక సంస్థల పాలకవర్గాలకు కల్పిస్తూ ఇటీవలే ప్రభుత్వం సీఆర్డీఏ చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా రాజధాని ప్రాంత గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాలను పేదల ఇళ్ల కోసం కేటాయింపునకు గానూ ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
సీఆర్డీఏ చట్ట సవరణ మేరకు ప్రత్యేకంగా ఈ జోన్ ను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ ను ఇచ్చింది ప్రభుత్వం. సీఆర్డీఏ ప్రతిపాదన మేరకు ఆర్ – 5 జోన్ పేరుతో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ముసాయిదాలో పేర్కొంది. రాజధాని ప్రాంతంలోని అయిదు గ్రామాల పరిధిలో పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాలతో పాటు తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్ – 5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం.
జోనింగ్ లో మార్పులు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేసేందుకు ప్రభుత్వం 15 రోజులు గడువు ఇచ్చింది. నవంబర్ 11వ తేదీ వరకూ సీఆర్డీఏ కార్యాలయంలో గానీ, ఈ మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా ప్రజలు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అయితే ఓ పక్క అమరావతి రాజధాని వివాదంపై హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు విచారణ దశలో ఉండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సీఆర్డీఏ చట్ట సవరణలపైనా హైకోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష టీడీపీ అడ్డుకుంటోందంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తే ఆ నెపాన్ని టీడీపీపై వేయడం ద్వారా పేద ప్రజల మద్దతును వైసీపీ గెయిన్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి మరి.