హైదరాబాద్, జనవరి 19: సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణలో రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం కొలువు దీరిన తొలి సారి శనివారం ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం పయనిస్తోంది అని ఆయన స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.
విద్యుత్ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని ఆయన చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు.
2019 మార్చి నాటికి మిషన్ భగీరథ పథకం పూర్తవుతుందనీ, ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవలే సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకమనీ, పాలమూరు – రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయనీ ఆయన చెప్పారు.
త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలబడుతుంధని ఆయన చెప్పారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు సరిపడా కరెంట్ అందుతోందని ఆయన అన్నారు.
రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టడం సంతోషదాయకమని ఆయన అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ర్టాలు రైతుబంధు పథకం అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా రైతులకు కొత్త పాసు పుస్తకాలు అందించామని ఆయన చెప్పారు.
చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని ఆయన అన్నారు. ధ్వంసమైన కులవృత్తులు మళ్లీ జీవనం పోసుకుంటున్నాయని ఆయన అన్నారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామనీ, గద్వాలలో కూడా టెక్స్టైల్ హబ్ నిర్మించే యోచనలో ఉన్నామనీ ఆయన చెప్పారు
వచ్చే విద్యాసంవత్సరంలో మరో 119 గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల కోసం వచ్చే బడ్జెట్లో నిధులు మరిన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల చెంతకే వైద్య సేవల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత వైద్య పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశామనీ, త్వరలోనే సూర్యాపేటలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామనీ ఆయన చెప్పారు.
పరిపాలన, శాంతిభద్రతల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామనీ, ప్రభుత్వ పాదర్శకత వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొత్తగా 4 వేల పరిశ్రమలకు అనుతులు ఇచ్చినట్లు తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. స్థలం ఉండి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేస్తామని ఆయన అన్నారు.
ప్రసూతి, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. కేసీఆర్ కిట్లో శిశువు, తల్లి కోసం రూ. 2 వేల విలువ చేసే 16 రకాల వస్తువులు ఇస్తున్నాం. కంటి వెలుగు శిబిరాల్లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పథకం కింద ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశామనీ. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనుల కలలు సాకారం చేశామని ఆయన చెప్పారు.
previous post
next post