Governor CM Meet: సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి అనేక కారణాలు ఉంటాయి.. పార్టీలో పదవులు ఇచ్చినా.., భేటీలు వేసినా, ఢిల్లీ వెళ్లినా.. ఏమైనా అనేక మూల కారణాలు కచ్చితంగా ఉంటాయి అందుకే ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని సీఎం జగన్ కలవనున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ ఇద్దరూ కలవబోతున్నారు. చివరిగా జనవరి మొదటి వారంలో ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ రోజున మాత్రమే కలిసారు. పార్టీ తరపున కొత్త ఎమ్మెల్సీల నియామకాలపై చర్చించడానికి భేటీ కానున్నారని సమాచారం. ఇప్పటికే గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు భర్తీ చేస్తూ వైసీపీ పేర్లు పంపించింది. కొయ్యే మోషేను రాజు, తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, లెల్ల అప్పిరెడ్డి ల పేర్లు వైసీపీ సిఫార్సు చేసింది. కానీ గవర్నర్ ఆమోదించలేదు. ఈ కారణాలు తెలుసుకుని, అంతర్గతంగా సర్ది చెప్పడానికే జగన్ కలుస్తున్నారు అనేది ఒక కారణం.
Governor CM Meet: గవర్నర్ అభ్యంతరాలు ఇవే…! తోటపై చాలా పెద్ద కేసు..!
గవర్నర్ కూడా ఈ ఎమ్మెల్సీల సిఫార్సుల విషయంలో చాలా అభ్యంతరాలతో ఉన్నారట. ముఖ్యంగా తోట త్రిమూర్తులు పేరు విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఈ పేరుని వద్దు అన్నారని సమాచారం. తన కోటాలో వచ్చే ఎమ్మెల్సీలకు క్రిమినల్ చరిత్ర ఉండడం తనకు నచ్చదని, తనకు అపవాదు అవుతుందని గవర్నర్ భావించి ఉండవచ్చు..
* తోట త్రిమూర్తులుపై 1996 నుండి ఒక కేసు పెండింగ్ లో ఉంది. 1996 డిసెంబర్ 29 న తన సొంత గ్రామానికి దగ్గర్లోనే కొందరు దళితులకు శిరోముండనం చేయించిన కేసులో ఏ వన్ గా త్రిమూర్తులు ఉన్నారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన వర్గానికి చెందిన కొందరు దళితులను ఆయనే దగ్గరుండి శిరోముండనం చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసు ఇప్పటికీ నడుస్తుంది. అప్పటి నుండి తోట త్రిమూర్తులు ఏ పార్టీ అధికారంలో ఉంటె, ఆ పార్టీలో ఉంటూ కేసుని తొక్కి / నొక్కి పెట్టె ప్రయత్నం చేస్తున్నప్పటికీ…
* గత ఏడాది అదే జిల్లాలోని సీతానగరంలో ప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం జరిగింది. అనంతరం 1996 నాటి కేసుని మళ్ళీ దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అప్పటి మంత్రి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హోమ్ మంత్రికి లేఖ రాశారు.. 1996 నాటి శిరోముండనం కేసు ఇంకా ఉండగానే గవర్నర్ కోటాలో తోటకి ఎమ్మెల్సీ ఇస్తే అది జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తుందని గవర్నర్ భావిస్తున్నారు..
* మరోవైపు లెల్ల అప్పిరెడ్డి పై కూడా కొన్ని క్రిమినల్ కేసులున్నాయి. రైల్ రోకో వంటి కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఈయన పేరుపై కూడా గవర్నర్ అభ్యంతర చెప్పినట్టు తెలిసింది. అయితే జగన్ భేటీ తర్వాత అప్పిరెడ్డి పేరుని ఒప్పుకుంటే ఒప్పుకుంటారేమో కానీ… త్రిమూర్తులు పేరు విషయంలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే త్రిమూర్తులుని వచ్చే నెలలో జరిగే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా చేసి.. ఈ సారికి మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?