రాజ్యాంగం, ప్రాథమిక సూత్రాలు, రాష్ట్రపతి, గవర్నర్, పరిపాలన విభాగం ఇవన్నీ ఏడో తరగతి నుంచే పిల్లలకు పాఠ్యాంశాలుగా ఉంటాయి. వాటిలో సాధారణంగా ప్రతి తరగతిలోనూ ప్రతి ఉపాధ్యాయుడు చెప్పేది శాసనసభ, పార్లమెంటు, సీఎం, పిఎం, వారి విశేషాధికారాలు చెప్తూ గవర్నర్, రాష్ట్రపతి ఉంటారు వాళ్ళు రబ్బర్ స్టాంప్ గానే ఉంటారు, సంతకానికి విలువ ఉంటుంది తప్ప మనిషికి విలువ ఉండదు అని చెప్తూ ఉంటారు. ఇది ప్రతి చుట జరిగే భోధనలో భాగంగానే జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే… రాష్ట్రానికి గవర్నర్ విలువ ఎంతటిదో, గవర్నర్ సంతకం ఎంతటిదో ఇప్పుడు బాగా తెలుస్తోంది. ఏదయినా బిల్లుని శాసన సభ ఆమోదించడం తరువాత శాసన మండలి ఆమోదించడం, గవర్నర్ ఆమోదించడం తర్వాత చట్టం గా మారడం, అమలులోకి రావడం జరిగి పోతాయి. కానీ వివాదాస్పద క్లిష్ట పరమైన బిల్లులు వచ్చినప్పుడే గవర్నర్ నిర్ణయం కీలకం అవుతుంది. ఇప్పుడు ఏపీలో గవర్నర్ నిర్ణయమే కీలకం. గవర్నర్పైన, గవర్నర్ సంతకం పైన రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంది.
ఏమి చేసినా ఆయనకు మచ్చ, మరక తప్పదు..క్లిష్ట పరిస్థితిలో గవర్నర్..!
ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇప్పుడు ఒక రకమైన క్లిష్ట పరిస్థితిలోకే వెళ్లారు. “కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం” అనే చందంలో అయన కుడితిలో పడ్డ ఎలుక లా ఉన్నారు. బిల్లులను ఆమోదిస్తే రాజధాని ప్రాంత ఉద్యమానికి అన్యాయం చేసిన వారుగా మిగిలిపోతారు. టీడీపీ, బీజేపీలోని ఒక వర్గం ఆయనను తప్పు పట్టే అవకాశం ఉంది. ఇదే విషయం మీద రేపు కోర్టు కు వెళితే అయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సంతకం పెట్టకపోతే, బిల్లును తిరస్కరిస్తే ప్రభుత్వానికి దూరమవుతారు. ప్రభుత్వానికి బద్ధవ్యతిరేకిగా మారిపోతారు. సో.. గవర్నర్ సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయన నిర్ణయం ఎన్ని మలుపులు తీసుకుంటుంది, ఎలా ఉంటుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ఒక రాజధానిగా అమరావతి ఉండాలా? మూడు రాజధానులు ఉండాలా అనే నిర్ణయం కేవలం గవర్నర్ సంతకం మీద తప్ప ఇప్పుడు ఇంక ఎక్కడ లేదు.
వివాద రహితంగా పరిష్కారానికి ప్రయత్నాలు
దీనిపై గవర్నర్ కూడా తన అనుభవాన్ని ఉపయోగించి వివాదం ఏమి లేకుండా సింపుల్ గా పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో తనకు న్యాయ చిక్కులు ఎదురు కాకుండా, ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి ఎటువంటి ఒత్తిడిలు ఎదురవకుండా తన భుజాన వేసుకోకుండా ఉండేందుకు న్యాయ సలహా కోరారు. మూడు రాజధానుల బిల్లును మొదటి దశలో శాసనసభ ఆమోదించింది. ఆ తర్వాత అదే బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపించింది. సెలెక్ట్ కమిటీలో ఆ వ్యవహారం నాలుగుతుండగానే కోర్టు వరకు వెళ్లింది. కోర్టులో కూడా ఈ విషయం వాయిదాలు జరుగుతుండగానే మళ్లీ అదే బిల్లును రెండవ సారి శాసనసభ ఆమోదించి మండలికి పంపించింది. నెల రోజుల వ్యవధిలో మండలి దానిపై చర్చ చేపట్టి ఆమోదించక పోతే ఆటోమాటిక్ గా ఆమోదం పొందినట్లే అనే ఒక క్లాజ్ ను, ఒక పాయింట్ ను పట్టుకొని ప్రభుత్వం గవర్నర్ కు పంపించింది. అంటే ఇప్పుడు గవర్నర్ దీన్ని ఆమోదించాలా? వద్దా? మండలి దీన్ని ఆమోదించినట్లా? కాదా? అనేది న్యాయసలహా అవసరం అయ్యింది. ఇది వరకే ఒక బిల్లును శాసన మండలి సెలెక్ట్ కమిటీ కి పంపించడం, సెలెక్ట్ కమిటీలో ఈ అంశం ఉండటం, కోర్టు పరిధిలో ఉండటం, మళ్ళీ రెండవ సారి గవర్నర్ వద్దకు రావడం ఇవన్నీ ఆయనకు కూడా తలనొప్పిగా మారాయి. అందుకే న్యాయసలహా కోరి న్యాయనిపుణులు ఏమి చెపుతారో పరిశీలించి, భవిష్యత్ లో తనకు న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వకుండా పరిష్కారం చూపేలా గవర్నర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.