హైదరాబాదు, జనవరి 21: తెలంగాణా రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ విధానంలో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ఉప సర్పంచ్ ఎన్నికను రిటర్నింగ్ అధికారి చేపడతారు.
మొదటి విడత జరిగే 4479 పంచాయతీల్లో 769 పంచాయతీలు, 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తొమ్మిది పంచాయతీలు, 192 వార్డులకు దాఖలైన నామినేషన్లు పూర్తిగా చెల్లకుండా పోయాయి. మొదటి విడత ఎన్నికల్లో 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు, 28,976 వార్డులకు 70,004మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా రెండు విడతల పోలింగ్ ఈ నెల 25,30 తేదీల్లో జరగనుంది.