హైదరాబాదు, జనవరి 25: తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమయ్యింది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రెండవ విడత 3342 గ్రామ పంచాయతిలు, 26,191 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. 788 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. సర్పంచ్ పదవికి 10,317మంది, వార్డు మెంబర్లుగా 63,380మంది పోటీపడుతున్నారు.
సమస్యాత్మక ప్రాంతాలు, వివాదాస్పద పంచాయతీల్లోని 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
ఈ నెల 21న తొలి దశ పోలింగ్ నిర్వహించారు.
తొలి విడత పోలింగ్ సమయంలో గుర్తించిన లోపాలపై సమీక్ష జరిపిన అధికారులు ఈ పోలింగ్ సమయంలో అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.