(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
రాష్ట్రంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు నేరుగా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అందుతుండటంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల సేవలను ప్రజలు గ్రామ సచివాలయంలోనే పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా వాలంటీర్ వ్యవస్థ పని చేస్తున్నది.
ఈ వ్యవస్థ మరింత పకడ్బందీగా పని చేసేందుకు గానూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలకు గ్రామ, వార్డు సెక్రటరీ, వాలంటీర్ల శాఖ బాధ్యతలను జగన్ అప్పగించారు. గ్రామ సెక్రటరీ, వాలంటీర్ల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, వార్డు సెక్రటరీ, వాలంటీర్ల బాధ్యతలను మంత్రి బొత్స సత్యనారాయణకు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.