(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కర్నూలు: ఏపి రాజధానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ నేతలు మంగళవారం లేఖ రాశారు. కమిటీలో 16మంది ఉండగా గ్రేటర్ రాయలసీమకు చెందిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారని అన్నారు. తెలుగు వారి ఐక్యత కోసం గ్రేటర్ రాయలసీమ వాసులు ఎన్నో త్యాగాలు చేశారనీ, ఇప్పుడు మళ్లీ త్యాగాన్ని చేయలేరని అన్నారు. రాజధాని రాయలసీమ వాసుల సెంటిమెంట్ అని గుర్తించాలన్నారు. గ్రేటర్ రాయలసీమకు రాజధానిని సిఫార్సు చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణానికి 80 వేల ఎకరాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా త్యాగం చేసిన విషయాన్ని రాయలసీమ నేతలు గంగుల ప్రతాప్రెడ్డి, మైసూరారెడ్డి, శైలజానాథ్, చెంగారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.