హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ తీసుకుని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనావా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తూ చట్టబద్ధత కల్పించాలని గ్రేటర్ రాయలసీమ నేతలు కోరారు. ఈ మేరకు మాజీ మంత్రి మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు దినేశ్రెడ్డి, ఆంజనేయరెడ్డితో పాటు 16 మంది గ్రేటర్ రాయలసీమ నేతలు శనివారం సీఎం జగన్ కు లేఖ రాశారు.
గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించి అక్కడ మిగిలిన నీటిని రాయలసీమకు కేటాయించాలని వారు కోరారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రకటనపై సీఎం జగన్ చొరవ తీసుకోవాలని కోరారు.
బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. తెలుగు గంగకు 25 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారని, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా కేటాయించలేదనీ పేర్కొన్నారు. ఆ తీర్పు అమల్లోకి వస్తే ఈ ప్రాజెక్టులన్నీ నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయనీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముందున్న ప్రత్యామ్నాయం గోదావరి జలాలు మళ్లించడమేననీ స్పష్టం చేశారు. పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా ఆదా అయిన నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి చట్టబద్ధత కల్పించడం తప్ప మరో దారి లేదనీ పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు గత రెండేళ్లుగా తరలింపు జరుగుతోందనీ పేర్కొన్న రాయలసీమ నేతలు.. ఆ మేరకు కృష్ణా జలాలు ఆదా అవుతున్న మాట వాస్తవమేనని అన్నారు. ఆదా అవుతున్న కృష్ణా నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి, శాసనసభలో చట్ట బద్ధత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.