”కచ్చితంగా 25 స్థానాలు గెలుస్తాం” ఇది ఎన్నికల సభల్లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు…
”మీడియా వల్లనే ఓడిపోయాం.. కాంగ్రెస్ పార్టీ కు సమాధి చేయడానికే మీడియా సుపారీ తీసుకుంది”
ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు…
కాంగ్రెస్ గ్రేటర్ ఫలితాల్లో బాధ పడడానికి ఏముంది? 2016 లో వచ్చిన రెండు సీట్లు మళ్లీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చాయి. దీనిలో పెద్ద తేడా ఏముంది?? పైగా అప్పట్లో నాయకులంతా తెగ ప్రచారం చేసిన, వచ్చినవి రెండే. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం రేవంత్ రెడ్డి ప్రధాన పాత్రలో సాగింది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డీ ఓ చేయి వేశారు. అంతే తప్ప కాంగ్రెస్ పేరు చెప్పుకుని, గతంలో భోగాలు అనుభవించిన వారంతా సైలెంట్ గానే ముందుగా ఓటమి ఒప్పుకున్నారు. అంటి ముట్టనట్లు ఉన్నారు. దీనికి ప్రేమంత రెడ్డి ఎందుకు ఇంత నిర్వేదం వ్యక్తం చేస్తున్నారనేది వృధా ప్రయసే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పది మంది వస్తారు… కాంగ్రెస్కు అధికారం లేకపోతే దాన్ని ఎవరూ కనీసం పట్టించుకోని కూడా పట్టించుకోరు. అన్నది రేవంత్ గుర్తెరగాలి. మొదటి నుంచి టిడిపి కార్యకర్తగా మెలిగిన రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోగానే పార్టీ నడక నడత మారిపోతుందని అనుకోవడం ఉత్త భ్రమే..
బీజేపీ ఆక్రమించినట్లే
భవిష్యత్తులో 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనిపించే పరిస్థితి లేదనే చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోతే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలోనూ క్రమంగా ఉనికి కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.
** గ్రేటర్ హైదరాబాద్ తీర్పును చాలా చిన్నగా చూడలేం. దాదాపు 70 లక్షల మంది ఓటర్ల తీర్పుగా దీనిని భావించాలి. ఓటు వేసింది ఎంతమంది అనేది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో సగభాగం మంది హైదరాబాద్ తో సంబంధం ఉంటుంది. ఇక్కడి రాజకీయాలే కాదు ఎక్కడ సంప్రదాయాలు తెలంగాణ ప్రజల ఆత్మగా భావిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి కొత్తదనం స్పష్టంగా కనిపించింది. అధికార టిఆర్ఎస్ కు ధీటుగా భాజాపా విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడింది. చివరకు టిఆర్ఎస్ కు ధీటుగా ఫలితాలను రాబట్టుకుంది. బూత్ లెవెల్ కార్యకర్త దగ్గర నుంచి జాతీయ స్థాయి అధ్యక్షుడి వరకు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పోరాడింది. అత్యంత తక్కువ సమయాన్ని చక్కటి ప్రణాళికతో ఉపయోగించుకుంది.
** కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. కార్యకర్తల మాట అటుంచి నాయకులు సైతం గ్రేటర్ ఎన్నికలకు మొహం చాటేశారు. తెలంగాణ లోని ఇతర ప్రాంతాల నాయకులు కనీసం బాధ్యత తీసుకునేందుకు ముందుకు రాలేదు. డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ విఫలమైంది. కేవలం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ప్రచారంలో ముందుకు సాగారు తప్పితే మిగిలిన నాయకులు కనీసం ప్రచారానికి రాలేదు. ఇక ఢిల్లీ స్థాయి నాయకులు హైదరాబాద్ ఎన్నికలను అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ను చాలా సాదాసీదాగా తీసుకుంది.
** కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో తన గొయ్యి తానే తవ్వుకుంది. ఆంధ్ర ప్రాంతం పరిస్థితి అటుంచితే ఇప్పుడు తెలంగాణలో సైతం సోయి లో కనిపించే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చామని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైన తర్వాత కూడా అధికార తెరాసను ఎదిరించే సాహసం చేయలేకపోయింది. ప్రజా పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ నాయకులు పూర్తిగా వెనుకబడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను గొంతెత్తి అడగడం లో నాయకుల్లో చిత్తశుద్ధి కొరవడింది.
** బిజెపి కు కాంగ్రెస్ అంతా కిందిస్థాయి క్యాడర్ లేకపోయినా పోరాటంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఇక తెలంగాణ నాయకులకు దీటుగా సమాధానం చెప్పే కాంగ్రెస్ నాయకులు లేరు. గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత కోపాలు కాంగ్రెస్ పార్టీకి చేటు తెచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం పాత్రను పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ దాన్ని సరైన రీతిలో పోషించిన పోవడం వల్లనే బీజేపీ ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. భవిష్యత్తులో తెరాసతో పొట్లాడే పార్టీ బిజెపి అని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని కల్పించడం లోనే కాంగ్రెస్ పార్టీ అపజయం దాగుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో సైతం ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పోషించే పరిస్థితి కనిపించడం లేదు. దీన్ని సైతం బీజేపీ ఆక్రమిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఠా ముళ్ళు సర్దుకోవచ్చు.
** కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ స్థానాలను కాంగ్రెస్ గెల్చుకోలేక పోయింది. ఇక్కడ నలభై ఆరు స్థానాలు ఉంటే కేవలం రెండు మాత్రమే కాంగ్రెస్ కు దక్కాయి. అది కూడా రేవంత్ తన సొంత బలంతో గెలిపించుకున్న వే. మిగిలిన చోట్ల కాంగ్రెస్ కనీసం ప్రాబల్యం మాట దేవుడెరుగు డిపాజిట్లు తెచ్చుకోలేకపోయింది. ఇది దాదాపు కాంగ్రెస్కు చావుదెబ్బ తో సమానం అని రాజకీయ విశ్లేషకుల మాట. భవిష్యత్తులో తెలంగాణలో సైతం కాంగ్రెస్ కనుమరుగే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు.