అమరావతి: మొన్నటి ఎన్నికల్లో వైసిపి కోల్పోయిన మూడు పార్లమెంట్ స్థానాలలో రెండిటి ఫలితంపై కోర్టును ఆశ్రయించేందుకు వైసిపి సిద్ధపడుతోంది. గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఓట్ల లెక్కింపులో అధికారుల చర్యలను వైసిపి అభ్యర్థులు తప్పుబడుతున్నారు. ఫలితాలపై కోర్టును ఆశ్రయించే విషయంపై పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనుమతి కూడా తీసుకున్నారు.
ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు టిడిపి అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని గుంటూరు లోక్సభ వైసిపి అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి, శ్రీకాకుళం వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్లు ఆరోపిస్తున్నారు.
గుంటూరు లోక్సభ వైసిపి అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డిపై టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్ కేవలం 4,205 స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానంలో సుమారు 9,700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా అధికారులు తిరస్కరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫారం 13(ఎ) ద్వారా నమోదు చేసిన పోస్టల్ బ్యాలెట్లకు సంబందించి 13(బి) నెంబర్ను కవర్పై వేయలేదన్న కారణంగా వాటిని తిరస్కరించారు. పోస్టల్ బ్యాలెట్ల తిరస్కరణపై జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందనీ, ఏకపక్షంగా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించడానికి వీలులేదనీ, ఇది ఓటర్లకు ఉన్న హక్కులను కాలరాయడమేనని మోదుగుల అంటున్నారు.
ఇదే విధంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో సర్వీస్ ఓట్లు, పోస్టల్ ఓట్లు కలిపి మొత్తం 21,276 ఓట్లు పోల్ కాగా వీటిలో 6,980ఓట్లను అధికారులు తిరస్కరించారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు కేవలం 6,658ఓట్ల స్వల్ప మెజార్టీతో వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై విజయం సాధించారు. చెల్లని ఓట్లు 6,980ఓట్లను మళ్లీ లెక్కించాలని ఓట్ల లెక్కింపు సమయంలో దువ్వాడ కోరినా రిటర్నింగ్ అధికారి అంగీకరించలేదు. ఈ కారణాలు చూపుతూ ఫలితాలపై కోర్టును ఆశ్రయించడానికి వైసిపి అభ్యర్థులు సిద్ధపడుతున్నారు.
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనను మోసపూరితంగా ఓడించారనీ, ఓట్ల లెక్కింపులో మతలబు జరిగిందనీ టిడిపి అభ్యర్థి బోండా ఉమా కూడా ఆరోపిస్తున్నారు. మెదట తనకు మెజార్టీ ఉందని చెప్పారనీ, ఆ తరువాత ఫలితం తారుమారు చేశారనీ టిడిపి అధినేత చంద్రబాబు దృష్టికి ఉమా తీసుకువచ్చారు. దీనిపై కోర్టుకు వెళ్లేందుకు అనుమతి కోరగా న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలుస్తోంది.