విజయవాడ: టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కావాలనే పోలీసులతో తన ఇంటిపై దాడులు చేయించుకున్నారని బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు ఆరోపించారు.
ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి నేతలకు ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే ప్రజలను మభ్య పెట్టడానికి కొత్త నాటకాలు ఆడుతున్నారనీ విమర్శించారు.
సిఎం రమేష్ ఇంటిపై జరిగిన పోలీసుల దాడులు బూటకమని జివిఎల్ అన్నారు. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక బయటపెట్టిందని జివిఎల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో సానుభూతి కోసమే టిడిపి నేతలు పోలీసుల దాడులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. డ్రామాలు ఆడడం సిఎం రమేష్కు, టిడిపి నేతలకు కొత్తేం కాదని జివిఎల్ పేర్కొన్నారు.
సిఎం రమేష్ డ్రామాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని జివిఎల్ డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసిన టిడిపికి గట్టిగా బుద్ధి చెప్పాలని జివిఎల్ పిలుపునిచ్చారు.