GVMC Elections :జీవిఎంసీ ఎలక్షన్ GVMC Elections రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వానికి.. ఎన్నికల కమిషన్ కు మధ్య జరిగిన యుద్ధంలో ఎన్నికల కమీషన్ దే పైచేయి అయింది. ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశలు ముగిసి మరో నాలుగు రోజుల్లో చివరిదైన నాలుగో దశ జరుగబోతోంది. ఈ ఎన్నికల సమయంలో మొన్నటివరకూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హవానే కొనసాగింది. ఎన్నికల కమీషన్ కార్యాలయంలోని ఉద్యోగులపైనే చర్యలు తీసుకున్నారు. కలెక్టర్లు, ఎస్పీలను కూడా ఎన్నికల విధుల్లో లేకుండా బదిలీలు చేశారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగిస్తూ.. ఎన్నికల కమీషన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూపించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ముగిసి మున్సిపల్ ఎలక్షన్స్ జరుగబోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇందులో భాగంగా మొదటి బాణం సంధించారు ఎన్నికల కమీషనర్.
చర్చనీయాంశమైన కమీషనర్ బదిలీ..
గ్రేటర్ విశాఖ కమీషనర్ గుమ్మళ్ల సృజనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. త్వరలో విశాఖ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆమె బదిలీ రాజకీయంగా సంచలనం రేపింది. ఆమె స్థానంలో నాగలక్ష్మిని నియమిస్తూ.. సృజనను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ఇదంతా ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకే ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అయితే.. ఈ పరిస్థితిని ముందే ఊహించారో ఏమో సృజన.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే 15 రోజులు సెలవు మీద వెళ్లారు. ఆమె సెలవులో ఉండగానే ఈ ఆదేశాలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సృజనపై జీవిఎంసీ పరిధిలోని రిజర్వేషన్ల విషయంలో ఎలక్షన్ కమీషన్ కు అందిన ఫిర్యాదులే కారణమని తెలుస్తోంది. రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితత్వం పాటించలేదని.. కొన్ని రిజర్వేషన్లు కావాలని కల్పించారనే ఆరోపణలు, ఓటర్ నమోదు, వార్డులు, డివిజన్ల విషయంలో సృజనపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు అందడంతో.. సృజనతోపాటు జిల్లా కలెక్టర్ కు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆ ‘నేత’ ప్రయత్నాలు ఫలించలేదా..?
అయితే.. సాక్షాత్తూ ఎన్నికల కమీషనే ఆదేశాలు జారీ చేయడంతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు ఇవ్వక తప్పని పరిస్థితి. అయితే.. కమీషనర్ గా సృజన బదిలీని స్థానికంగా బలంగా ఉన్న నేత అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. పరిస్థితి ఇంతకు వస్తుందని తెలిసే సృజనను సెలవు పంపించారని సమాచారం. ఆమె స్థానంలో ఎన్నికలు అయ్యేవరకూ ఇంచార్జి మున్సిపల్ కమీషనర్ ను నియమించాలని స్థానిక నేత గట్టిగా ప్రయత్నాలు చేసినట్టు వినికిడి. అయితే.. ఎన్నికల కమీషన్ నుంచి పూర్తిస్థాయి కమీషనర్ నే నియమించాలని.. ఇంచార్జి కాదని స్పష్టమైన ఆదేశాలు రావడంతో నాగలక్ష్మిని పూర్తిస్థాయి కమీషనర్ గా నియమిస్తూనే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అక్కడ ఆ నేత తన మాట నెగ్గించుకోలేకపోయారని అంటున్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న మున్సిపల్ ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులన్నీ తెలిసిన సృజన బదిలీ షాక్ అనే చెప్పాలి.
విశాఖ ప్రతిష్టాత్మకం కానుందా..?
ఇంతగా విశాఖ మున్సిపల్ కమీషనర్ నే బదిలీ చేయాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయనే వాదనలూ లేకపోలేదు. విశాఖను రాష్ట్ర రాజధానిగా మార్చే క్రమంలో సీఎం జగన్ విశాఖ కార్పొరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ కార్పొరేషన్ ను గెలిచి సీఎంకు బహుమతిగా ఇవ్వాల్సింది ఆ ప్రాంత నాయకులదే. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులంతా ఈ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్దమవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో వారికి మూడేళ్లుగా విశాఖలో పని చేస్తూ పట్టు సాధించిన మున్సిపల్ కమీషనర్ సృజన బదిలీ షాక్ ఇచ్చేదే. ఇప్పుడు కొత్తగా వచ్చే కమీషనర్ కు స్థానిక పరిస్థితులు అర్ధం చేసుకునేందుకు పెద్దగా సమయం లేదు. దీంతో ఓటింగ్ లో కానీ, మున్సిపల్ కమీషన్ పరంగా కానీ, రాజకీయంగా కానీ.. విమర్శలు లేకుండా ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ఉద్దేశంతోనే ఆమెను బదిలీ చేశారని చెప్పాలి. పైగా.. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటువంటి విషయాల్లో ఏ చిన్న ఫిర్యాదు వచ్చిన ఉపేక్షించడం లేదు. మరి.. ఈనేపథ్యంలో అసలు సృజన విషయంలో వచ్చిన ఆరోపణల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.