త్వరలో దుబ్బాక ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. జరగబోయే ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని విపక్షాలు కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీల నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎలాంటి ఉప ఎన్నిక అయిన టిఆర్ఎస్ పార్టీ గెలవడంతో ఈ ఉప ఎన్నిక లో ఎట్టిపరిస్థితుల్లో పార్టీ ఓడిపోకూడదు అని.. మరోవైపు టిఆర్ఎస్ ఎక్కడికక్కడ వ్యూహాలతో దూసుకుపోతుంది. ఈ ఉప ఎన్నిక బాధ్యతలు తీసుకున్న మంత్రి హరీష్ రావు… నియోజకవర్గంలో పర్యటిస్తూ టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ ని అలర్ట్ చేస్తూ ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారు. కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది..?, అదేవిధంగా దుబ్బాక నియోజక వర్గానికి టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో వంటి విషయాలు గురించి తెలియజేస్తూన్నారు.
ఇదిలా ఉండగా.. దుబ్బాక నియోజకవర్గానికి బిజెపి చేసింది కాకిరెట్ట అంతా డప్పు కొట్టుకునేది కొండంత అన్నట్టు ఎద్దేవా చేశారు. దీనికే వాళ్లు సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని… అవార్డు కూడా ఆ పార్టీకి ఇవ్వచ్చు అంటూ హరీష్ బీజేపీ పై సెటైర్లు వేశారు. రాష్ట్ర దళిత మోర్చా కౌన్సిల్ సభ్యుడు ఎల్లయ్య తో పాటుగా 150 మంది బిజెపి కార్యకర్తలు హరీష్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు. అందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన ఘనత కేసీఆర్ ది, అయితే ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగి తెలంగాణకు అడ్డుపడిన చరిత్ర ఉత్తంకుమార్ రెడ్డిది అని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీది త్యాగాల చరిత్ర అయితే కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అంటూ జరగబోయే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, పోటీ కేవలం రెండో స్థానానికి. అది కూడా బిజెపి- కాంగ్రెస్ మధ్య జరుగుతుంది అన్నట్టు హరీష్ రావు తెలిపారు.