ప్రధాని మోదీపై అసదుద్దీన్ విమర్శలు
హైదరాబాద్: పుల్వామా ఉగ్రవాద దాడి అంశంలో ప్రధాని మోదీని విమర్శించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఆయననే టార్గెట్ చేశారు. ముందుగా సోషల్ మీడియా ద్వారా ఎంఐఎంకు ఓట్లు వేయాలని, ఓటింగు శాతాన్ని పెంచాలని అభ్యర్థించారు. గత వారం మోదీ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులను ట్యాగ్ చేస్తూ ఓటింగుపై అవగాహన కల్పించాలని కోరారు. తాజాగా ఒవైసీ మరోసారి మోదీని టార్గెట్ చేశారు. ‘‘రెండు రోజుల క్రితం నేనో మాట అన్నాను. పుల్వామాలో ఆత్మాహుది దాడి జరిగి జవాన్లు మరణించినపుడు ప్రధాని మోదీ బాధ్యత తీసుకుంటారా అని అడిగాను. కానీ ఆయన బీఫ్ బిర్యానీ తిని నిద్రపోతున్నారని చెప్పాను. సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్లు ఆయన మాంసాహారం తినరని చెప్పారు. ఆయన ఏం తింటారో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన డోక్లా, ఇడ్లీ లేదా వెజిటబుల్ బిర్యానీ తిని నిద్రపోయారా?’’ అంటూ ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో బీజేపీ టీషర్టులు, ఇతర వస్తువులు బయటకు తేవడాన్ని కూడా విమర్శించారు. ‘‘వ్యాపారవేత్తలంతా జీఎస్టీ విషయంలో తమను వేధిస్తున్నారని బాధపడుతున్నారు. ఇంకా, మోదీ మాత్రం టీషర్టులు అమ్ముతున్నారు. ఏం చౌకీదార్ ఈయన.. జెట్ ఎయిర్ వేస్ మునిగిపోయింది. ఈ చౌకీదార్ ఆ సంస్థకు రూ. 1500 కోట్లు ఇవ్వాలని బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నారు. మేకిన్ ఇండియా పేరుతో వేలాది ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. వాళ్లకు కూడా రుణాలు ఇవ్వగలరా?’’ అని అన్నారు. ‘‘రూ. 1500 కోట్లు ఎలా పడితే అలా ఇచ్చేస్తారా? ఇదేమైనా మీ బాబు సొమ్మా’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ ను పాకిస్థానీ ఉగ్రవాది మసూద్ అజహర్ బంధువని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనడాన్ని కూడా ఒవైసీ విమర్శించారు.