హైదరాబాద్, జనవరి 23: ఎన్టిఆర్ జీవిత చరిత్రపై రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో దగా..దగా..కుట్ర అనే పాట తొలగింపునకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులకు, నిర్మాతకు తెలంగాణా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పాట ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కించపరిచే విధంగా ప్రస్తావన ఉందని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
చిత్ర దర్శకుడు విడుదల చేసిన టీజర్లో భాగంగా విడుదలైన ఆ పాటలో చంద్రబాబును ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉందనీ వర్మ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఆ చిత్రం నుండి ఆ పాటను తొలగించేవిధంగా కేంద్ర సెన్సార్బోర్డును, సమాచార మంత్రిత్వశాఖను ఆదేశించాలని పిటీషనర్ కోరాడు.
ఈ పిటీషన్పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కేంద్ర, రాష్ట్ర సెన్సార్బోర్డులతోపాటుగా చిత్ర నిర్మాతకు నోటీసులు జారీచేసింది.
చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి మార్చిలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ఈ సినిమాకు ఎటువంటి సంబంధంలేదని ఆయన చెప్పారు. ఏవైనా అడ్డంకులు వస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు.
ఈ పిటీషన్ హైకోర్టు విభజనకు ముందుగా ఫైల్ చేయడంతో తెలంగణా హైకోర్టులోనే కేసును విచారిస్తున్నారు.