ఏపీ సీఎం గా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు హైకోర్టులో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దాదాపు ఏడాది పరిపాలనలో జగన్ తీసుకున్న 60 నిర్ణయాలకు పైగా హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలాయి. అతి తక్కువ టైమ్ లోనే హైకోర్టులో ఓ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు అబాసుపాలు అవ్వడం దేశంలో ఇదే తొలిసారి అని వైసీపీ ప్రభుత్వం పై రాష్ట్రంలో చాలా పార్టీల నుండి విమర్శలు వచ్చాయి. ఇదే రీతిలో కోర్టు ఇస్తున్న తీర్పులను అడ్డంపెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అదేరీతిలో రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలలో న్యాయస్థానాలలో మొట్టికాయలు మీద మొట్టికాయలు పడే రీతిలో తీర్పులు రావటంతో ఒకింత ప్రజలలో కూడా వైసీపీ సర్కార్ పరువు పోయినట్లు అయింది.
ఈ రకంగా ఏపీ హైకోర్టు నుండి బ్యాడ్ న్యూస్ లు మీద బ్యాడ్ న్యూస్ లు వింటున్న జగన్ ప్రభుత్వానికి మొట్టమొదటిసారి గుడ్ న్యూస్ చెప్పే రీతిలో ఏపీ హైకోర్టు కొన్ని కీలకమైన విషయాల్లో వ్యవహరించడం వైసీపీ పార్టీలో ఊపిరి పీల్చుకున్నట్లయింది. పూర్తి విషయంలోకి వెళ్తే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతిని వెలికితీయడానికి ప్రత్యేక క్యాబినెట్ ఏర్పాటు చేసి…. జరిగిన అవినీతికి సంబంధించి ఓ నివేదిక తయారు చేయడం అందరికీ తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కింజరాపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం లో దాదాపు 150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆధారాలు సేకరించి జూన్ 12వ తారీకున అరెస్టు చేయడం జరిగింది.
ఈ కేసు విషయంలో అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ ఇప్పటివరకు అనేక సార్లు ఏసీబీ కోర్టులో మరియు హైకోర్టులో అప్లై చేసుకున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. తాజాగా హైకోర్టు లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా విచారణ కీలకంగా ఉన్న సమయంలో బెయిల్ మంజూరు చేయడం సబబు కాదని అవినీతి నిరోధక శాఖ తరపున న్యాయవాది చేసిన వాదనలను సపోర్ట్ చేస్తూ ఏపీ హైకోర్టు అచ్చెన్నాయుడు అప్లై చేసుకున్న బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.
అంతేకాకుండా ఏ1 రమేష్ కుమార్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పర్సనల్ అసిస్టెంట్ మురళి అదే రీతిలో మరో నిందితుడు సుబ్బారావు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా కొట్టివేయడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే ఏపీ హైకోర్టు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్న జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు చాలావరకు సపోర్ట్ గా నిలుస్తూ తీర్పులు రావటంతో…విచారణలో ఉన్న కుంభకోణాలు రుజువైతే చంద్రబాబు కొంప కొల్లేరైపోయినట్లే అని పలువురు విశ్లేషిస్తున్నారు.