ఏపీ ప్రజలకు ఉపయోగపడేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయంపై పై హైకోర్టు స్టే ఇచ్చింది.ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి కోర్టుల నుంచి ఎదురుదెబ్బ తగిలిన విషయం అటుంచితే ప్రజలే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.
ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందాకు తెర దించే సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది.టిడిపి హయాంలో నారాయణ చైతన్య తదితర విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను భారీగా దోచుకున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణ, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యాప్రమాణాలు ఏర్పరిచే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.చైర్మన్ రెడ్డి కాంతారావు ఆధ్వర్యంలో ఈ కమిషన్ అనేక విద్యాసంస్థలను సందర్శించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.దీన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది ఇకపై ఫీజుల నియంత్రణ పూర్తిగా ఈ కమిషన్ పరిధిలో ఉంటుందని స్పష్టం చేసింది.
ఫీజుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యాసంస్థలు ఈ కమిషన్ దృష్టికి తేవాలని ఆదేశించింది.ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల నియామకాలు కూడా నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. ప్రభుత్వ సిలబస్ను కచ్చితంగా పాటించాలని, ఏస్కూల్కు ఆ స్కూల్ తమకు నచ్చిన సిలబస్ చెప్పుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పింది.దీంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల గొంతులో వెలక్కాయ పడినట్లైంది.వెంటనే సంబంధిత సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.కమిషన్ పేరుతో ప్రభుత్వం తమపై ఆధిపత్యం చెలాయించడం కుదరదని, తమ ఫీజులు తామే నిర్ణయించుకుంటామని, ఫీజులు తగ్గిస్తే.. విద్యా ప్రమాణాలు పడి పోతాయంటూ హైకోర్టుకి విన్నవించుకుంది.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కాంతారావు కమిషన్ కార్యకలాపాలపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు సంబరాలు చేసుకుంటుండగా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం డీలా పడిపోయారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఫీజుల భారం తగ్గుతుందని ఆశించిన విద్యార్థుల తల్లిదండ్రులకు హైకోర్టు స్టే ఆర్డర్ షాక్ ఇచ్చింది.