వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ ను జీవచ్చవంలా మార్చేసి.. పార్టీ భవిష్యత్ ఆశలు గల్లంతయ్యేలా చేసింది. బీజేపీలో మోదీ-అమిత్ షా ద్వయం యాక్టివ్ గా ఉన్నన్నాళ్లూ కాంగ్రెస్ మనుగడ కష్టమేనని దేశవ్యాప్తంగా వ్యాఖ్యాలు వినిపించాయి. వారిద్దరి వాగ్దాటిలో సగమైనా ధీటుగా సమాధానం చెప్పేవారు కాంగ్రెస్ లో లేరంటూ ఓ నిర్ణయానికి వచ్చేశారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. ప్రస్తుతం బీజేపీ చేస్తున్న తప్పులను కాంగ్రెస్ సమర్ధంగా వాడుకుంటోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన యూపీ హత్రాస్ అత్యాచార ఘటనను కాంగ్రెస్ స్పందించిన తీరు.. అక్కడ జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పై దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది.
నెట్టింట ఫొటోలు వైరల్.. సానుభూతికి చిహ్నాలు
యూపీలో అత్యాచార ఘటనపై నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ఘటనాస్థలానికి వెళ్లారు. రాహుల్ గాంధీని పోలీసులు చుట్టుముట్టారు. కార్యకర్తలు పోలీసులను నిలువరిస్తున్నారు. రాహుల్ గాంధీ అదుపుతప్పి పడిపోయారు. ఇది ఒక ఫొటోలో సారాంశం. కొంతమంది మగ పోలీసులు ప్రియాంక గాంధీ దుస్తులను పట్టుకుని లాగారు. ఆమె కళ్లు ఎరుపెక్కాయి. పిడికిలి బిగుసుకుంది. ఆమె ముఖంలో నాయనమ్మ ఇందిరా గాంధీ కనిపించారు. ఇది రెండో ఫొటో సారాంశం. హత్రాస్ లో పోలీసులు వీరిపట్ల నానా యాగీ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు వారి పట్ల ప్రవర్తించిన తీరు వారికి సానుభూతి తెచ్చిపెడుతోంది.
దీనిని అందిపుచ్చుకుంటేనా..
బీజేపీ కేంద్రం పరిధిలో, అధికారం ఉన్న రాష్ట్రాల్లో అనేక తప్పులు చేస్తోంది. వారికి ఎదురులేకపోవడం, ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా లేకపోవడంతో వారి హహా కొనసాగుతోంది. యూపీ ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పోసుకున్నట్టే. గాంధీ కుటుంబ వారసులు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రావడం, పోలీసులు వారిని అడ్డుకోవడం, ఆ ఫొటోలు వైరల్ కావడం, కాంగ్రెస్ పై సానుభూతి రావడం జరిగిపోయాయి. వీటితో దేశంలో కాంగ్రెస్ శ్రేణులు గర్వంతో తెలెత్తుకుంటుంటే.. తటస్థులు గాంధీ కుటుంబంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అదునుగా.. ఇదే పునాదిగా కాంగ్రెస్ బలోపేతమైతే వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ కు పూర్వవైభవం ఖాయమంటున్నారు విశ్లేషకులు.