అమరావతి రాజధాని అంశం ఎంత వివాదానికి దారి తీసిందో తెలిసిందే. మూడు రాజధానులను శాసనసభ ఆమోదించడం, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం తెలిసిన విషయమే. అయితే.. రాజధాని అంశంలో తమ పాత్ర ఏమీ లేదంటూ కేంద్రం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపై హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఈ వివాదంలోకి కేంద్రం దిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని, కేంద్రాన్ని లాగేందుకు అమరావతి పోరాట బృందం భావిస్తోంది. అందుకే కేంద్రానికి చట్టాలు, క్లాజులతో లేఖలు సందిస్తోంది.
తాజా లేఖ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘన అంటూ వ్యాఖ్యలు..
మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై అమరావతి పరిరక్షణ సమితి చైర్మన్ జీవీఆర్ శాస్త్రి హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాజధాని అంశంలో కేంద్రం తప్పుకోవడంపై పునఃపరిశీలించాలని లేఖలో కోరారు. ఆగష్టు 6న హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో రాజధాని ఎంపికపై కేంద్రం పాత్ర ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని పేర్కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం-2014 సెక్షన్ 6 ప్రకారం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసిందని.. తర్వాత 2015 ఏప్రిల్ 23న రాజధానిగా అప్పటి ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేసింది. ఇప్పుడు రాష్ట్ర రాజధాని ఎంపిక రాష్ట్రానిదే.. కేంద్రానికి కాదు అనటం తగదన్నారు.
జూలై 31న ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ లో రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో పలు విపరీతాలకు దారి తీసే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ లో ‘కేంద్రం పాత్ర లేదు’ అని పేర్కొనటం పొరపాటుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇది హోంశాఖ నిర్ణయం కాదనే తమ అభిప్రాయమన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానుల మార్పు తగదు అని పేర్కొన్నారు. ఈ తరహా రాజ్యాంగ ఉల్లంఘనలు మరోసారి జరక్కుండా చూడాలని ఆయన కోరారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?