ఏపీలో ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలంటే.. వైసీపీ, టీడీపీ, జనసేన అని చెప్పాలి. బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ తమ ఉనికి కాపాడుకుంటున్నాయి. అయితే.. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇవే పార్టీలున్నాయి. వీటికి అక్కడ ఉనికి, నాయకులు, అభిమానులు కూడా ఉన్నారు. కానీ.. అక్కడ టీఆర్ఎస్ దే హవా.. ఏకచత్రాధిపత్యం కూడా. స్వతహాగా తెలంగాణ పార్టీ కాబట్టి ఏపీలో లేదు. కానీ.. పైన పేర్కొన్న పార్టీలేవీ తెలంగాణలో ఇంపాక్ట్ చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రస్తుతం అక్కడ గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్ధులను కూడా ప్రకటించేలేక పోయింది. అక్కడ వైసీపీ ఉనికి లేదా, అభిమానులు లేరా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ కు వీరాభిమానులు ఉన్నారు. మరేమైంది..!?
తెలంగాణలో ఇప్పటికీ వైఎస్ అభిమానం..
ఉమ్మడి ఏపీలో వైఎస్ తన హావా చూపించారు. పాదయాత్రతో రాష్ట్ర ప్రజానీకాన్ని మెప్పించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అంతేకాకుండా.. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయంబర్స్ మెంట్, రుణమాఫీ.. వంటి పథకాల ద్వారా ప్రాంతీయ భావం లేకుండా తెలుగు ప్రజలకు చేరువయ్యారు. అయితే.. ఆయన మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ యాక్టివ్ కావడం, రాష్ట్రం విడిపోవడం జరిగింది. ఈలోపు జగన్ జైలుకు వెళ్లడం, కొత్త పార్టీ పెట్టడం.. జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఏపీ పార్టీగా ఉండిపోయింది. దీంతో ఏపీ రాజకీయాలపై పెట్టిన దృష్టి తెలంగాణ రాజకీయాలపై చూపలేక పోయారు జగన్. టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలనే ఈ పార్టీలు తెలంగాణలో ఉన్నాయా..? అసలు వీటి అవసరం ఉందా..? అనే పరిస్థితికి తీసుకొచ్చింది.
వైసీపీ ఏపీకే పరిమితమా..?
వైఎస్ కు, జగన్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారు. వైఎస్ వేసిన ముద్ర తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ ఏకంగా జగన్ ను సీఎం చేయలేదని తన మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పక్షాన నిలిచారు. చాలామంది పేరుమోసిన నాయకులు జగన్ వైపు ఉన్నారు. కానీ.. జగన్ తెలంగాణ వైపు చూడలేదు. అందుకే 2018, 2019లోనూ, ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లోనూ తెలంగాణలో అభ్యర్ధులను నిలబెట్టలేదు. రెండు పడవలపై కాలు.. అనే సామెతలా జగన్ లక్ష్యం ఒక్కటే పెట్టుకున్నారు సాధించారు. వైఎస్ కుటుంబంపై అభిమానం ఉంచుకోవాలే కానీ.. ఇకపై వైసీపీ ఇక్కడ పోటీ చేస్తుందనే ఆశను, ఊహను మర్చిపోక తప్పదు.