Huzurabad By Election: తెలంగాణ (Telangana Politics) మొత్తం ఒక్క నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. ఇక్కడి ప్రభుత్వం (TRS Party) తో పాటు అధికార ప్రతిపక్షాలు ఆ నియోజకవర్గం (Huzurabad)పై ఫోకస్ పెట్టి అక్కడే తిరుగుతున్నాయి. మరో వైపు తెలంగాణలో ఏ ఇద్దరు కలుసుకున్నా ఆ నియోజకవర్గం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ నియోజకవర్గమే హుజూరాబాద్ (Huzurabad By Election) నియోజకవర్గం. ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగుతున్న కారణంగా అందరి దృష్టీ దీనిపైనే ఉంది. ఇక్కడ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఎంత ఖర్చు పెడుతున్నారు. ఓటుకు ఎంత ఇస్తున్నారు అనేది తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. హూజూరాబాద్ లో 2లక్షల 58వేల మంది ఓటర్లు ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో అయితే సరాసరి 75 నుండి 80 శాతం వరకూ పోలింగ్ నమోదు అవుతుంది. ఇప్పుడు ఉప ఎన్నిక కావడంతో ఓటింగ్ శాతం 85 వరకూ ఉండవచ్చు.
Huzurabad By Election: గత గెలుపు ఈటెలదా..? టీఆరెస్ దా..!?
ఇక్కడ ప్రధానంగా ఎన్నికల బరిలో 30 మంది ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాల మధ్యే పోటీ నెలకొంది. బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్, అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిగా యువజన నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్ బల్మూరు పోటీలో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుండి ఈటల రాజేందర్ ఆరు సార్లు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తూ వచ్చారు. అయితే భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రి వర్గం నుండి సీఎం కేసిఆర్ బర్తరఫ్ చేయడంతో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుస్తూ వచ్చిన ఈటల నేడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకూ ఆయన టీఆర్ఎస్ బలంతో గెలుస్తున్నారా లేక వ్యక్తిగత ఇమేజ్ తో గెలుస్తున్నారా అనేది ఈ ఎన్నికల్లో తేలనుంది.
మరో పక్క ఈటల బీజేపీ నుండి పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ నాయకత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అధికార టీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ఈటల గెలుపునకు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం కోసం మంత్రి హరీష్ రావు అన్నీ తానై వ్యవహరిస్తూ వ్యూహాత్మక రాజకీయం నడుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు అధికం. ముదిరాజులు, గౌడ్స్, యాదవ, చేనేత సామాజిక వర్గాలు ఎక్కువ. ఈటల రాజేందర్ బీసీ సామాజికవర్గ నేత కావడంతో వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో పోటీ నువ్వా నేనా అన్న రీతిలో ఉందని భావిస్తున్నారు. వ్యక్తిగత చరిష్మా, సానుభూతి పవనాలు తన గెలుపునకు దోహదం చేస్తాయని ఈటల భావిస్తుండగా, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు తన గెలుపునకు కారణం అవుతాయని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధీమాగా ఉన్నారు.
అటు దుబ్బాక ఉప ఎన్నికల్లో, అటు తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ బాగానే ఖర్చు పెట్టాయి. అయితే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం కావడంతో ఇరు పార్టీలు గట్టిగానే ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. తాము వెళ్లగొట్టిన నాయకుడు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో అధికార టీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం ఎలాగైనా ఈటలను ఓడించాలన్న కంకణంతో సర్వశక్తులను ఒడ్డుతోంది. తన రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికతో ముడిపడి ఉండటంతో ఈటల కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. కీలక గ్రామాల్లో ఒక్కో ఓటుకు పది వేల వరకూ ఖర్చు పెట్టడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆరు నుండి ఎనిమిది ఓట్లు ఉన్న కుటుంబానికి లమ్సమ్ గా లక్ష, లక్షన్నర ఇస్తాం, మొత్తం ఓట్లు మాకే పడేలా చూడండి అన్నట్లు బేరసారాలు జరుగుతున్నట్లు భొగట్టా. సంప్రదాయ కుటుంబాలు ఉన్న చిన్న చిన్న గ్రామాలకు ఊరు మొత్తానికి ఇంత ఇస్తాం అన్నట్లుగా కూడా నేతలు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఒక పార్టీ అయితే ఓటుకు పదివేలతో పాటు పొటేలు (గొర్రెపోతు) కూడా ఆ ఇంటికి ఇచ్చేలా బేర సారాలు జరుపుతుందట. ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా ఖరీదు అయిన ఎన్నిక గా పేరు తెచ్చుకుంటోంది. అనధికార ఖర్చులో ఈ ఉప ఎన్నిక రికార్డు సృష్టించబోతున్నది అన్న టాక్ నడుస్తోంది.