(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
దుబ్బాక ఉప ఎన్నికల బరిలో బీజెపీ అభ్యర్థిగా ఉన్న రఘునందనరావుకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మద్య త్రిముఖ పోరు ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్యే అన్న టాక్ నడుస్తున్నది. ఎన్నికల్లో డబ్బులను పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు సంబంధించినట్లుగా భావిస్తున్న నగదును పెద్ద మొత్తంలో సీజ్ చేశారు. పది రోజుల క్రితం హైదరాబాదులో సిద్దిపేటకు తరలిస్తున్న రూ.40లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత నాలుగు రోజుల క్రితం సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందరావు మామ నివాసంలో 18లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా నేడు హైదరాబాదు నగర శివారులో కోటి రూపాయల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు హవాలా సొమ్ముగా పోలీసులు పేర్కొంటున్నారు. కోటి రూపాయలు స్వాధీనం చేసుకుని రఘునందనరావు బామ మరిది శ్రీనివాసరావు, డ్రైవర్ రవిలను అదుపులోకి తీసుకున్నామని హైదరాబాదు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పంపిణీకి ఈ నగదును తీసుకువెళుతున్నట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైందన్నారు. బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ నుండి నగదును దుబ్బాక తీసుకువెళుతున్నారనీ, ఈ నగదును మాీజీ ఎంపి వివేక్ మేనేజర్ ఇచ్చినట్లు నిందితులు తెలిపారని సీపీ మీడియాకు వెల్లడించారు.
దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి నేటి సాయంత్రం (ఆదివారం)తో ప్రచార పర్వం ముగియనున్నది. రేపటి నుండి రాజకీయ పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరలేపనున్నారనేది అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో బీజేపీ అభ్యర్థికి చెందినవిగా భావిస్తున్న కోటి రూపాయలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.