హైదరాబాద్: కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా హైదరాదాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం వామపక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీగా వస్తున్న వామపక్షాలు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వామపక్ష నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతోపాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి బయల్దేరిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన పలువురు విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనకారులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.