ఇలా చేసారో ఐదేళ్ల జైలు శిక్ష పడటం ఖాయం. అలాగే, లక్ష రూపాయలు సైతం జరిమానా విధిస్తారు. ఇది చెప్పింది ఏవరో కాదు కేంద్ర ప్రభుత్వమేనండి ! దేని గురించి అనుకుంటున్నారా? అదే నీటి గురించి ! ఎందుకంటే నిత్య జీవితంలో నీరు లేనిదే జీవితమే లేదు. నీరే మనిషికి ప్రాణాధారం. నీటి ప్రాధాన్యత, అవసరం ఎలాంటిదంటే.. ఒక్కరోజు నల్లాలు రాకపోతే గగ్గోలు పెడుతుంటాం! వాటర్ టాంకర్ రావడం కొంచెం ఆలస్యమైతే భరించలేం. అసలు నీరే లేకపోతే జీవితాన్ని ఊహించలేం ! అందుకే అంత ప్రాధాన్యత గల నీటిని వృధా చేయడం వంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
కేవలం హెచ్చరించడమే కాదు దానికి సంబంధించిన నీటిని దుర్వినియోగం చేసినా, వృథా చేసినా కఠిన శిక్షలు విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర భూగర్భ జలాల అథారిటీ విడుదల చేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం.. భూగర్భ జలాలను వృథా చేస్తే రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. అలాగే. ఐదేళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986లోని సెక్షన్ 5 ప్రకారం ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు.
రాజేంద్ర త్యాగి అండ్ ఫ్రెండ్స్ (ఎన్జీవో) అనే ఓ స్వచ్ఛంద సంస్థ నీటిని వృథా చేయడం, దుర్వినియోగం చేయడం శిక్షించదగిన నేరంగా పరిగణించాలని కోరుతూ ఎన్జీటీని ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ అనంతరం జాతీయ హారిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పై ఆదేశాలు జారీ చేసింది. నీటిని వృధా చేయడం లాభదాయకం కాదనీ, అలాంటి వ్యర్థాల ఖర్చును తిరిగి పొందేలా రెగ్యులేటర్లు చూసుకోవాలని ఎన్జీటీ కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు సూచించింది. ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు, జల మండలులు, జల నిగమ్లు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నీటి వృథాను, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.
ఈ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ మాట్లాడుతూ.. నీటిని వినియోగించడంలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా ఓవర్హెడ్ ట్యాంకుల వంటివాటిలో నీటిని నింపేటపుడు, మరుగుదొడ్లలో నీటిని వాడేటపుడు, వంట గదుల్లో నీటిని వినియోగించేటపుడు నీరు వృధా అవుతున్నట్లు తెలిపారు. ప్రజానీకానికి నీటి వినియోగంపై అవగాహన లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. నీటి అవశ్యకతను తెలియజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా, ఇంటిగ్రేటెడ్ జల వనరుల అభివృద్ధిపై ఏర్పాటైన జాతీయ కమిటీ నివేదిక ప్రకారం.. అవపాతం ద్వారా దేశ మొత్తం నీటి లభ్యత సంవత్సరానికి 4000 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం). అయితే, 2011- 2025 మధ్య సగటు వార్షిక తలసరి లభ్యత 25 శాతానికి పైగా తగ్గుతుందనీ, 2035 నాటికి 36 శాతానికి తగ్గుతుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే.