ప్రకాశం జిల్లాలో సీనియర్ వైసిపి ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కూడా అయిన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధరరెడ్డి అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.సహజ శైలిలోనే మానుగుంట స్పందిస్తున్నప్పటికీ,జిల్లాలోని వైసిపి ఎమ్మెల్యేలు మిగిలిన వారికి భిన్నంగా ఆయన వ్యవహార శైలి ఉండటం ఆసక్తి రేపుతోంది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో కందుకూరు నుండి గెలుపొందిన మహీధర్ రెడ్డి అంతకు కొద్ది రోజుల ముందే వైసీపీలో చేరారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కందుకూరులో వైసిపి అభ్యర్థిగా గెలుపొందిన పోతుల రామారావు టిడిపిలో చేరిపోవడంతో అక్కడ ఏర్పడిన ఖాళీ ని మహీధర్ రెడ్డి తో జగన్ భర్తీ చేశారు ఈ లోపే ఎన్నికలు రావటం ,కందుకూరులో మహీధర్ రెడ్డి గెలిచేయడం జరిగిపోయాయి.రాష్ట్రంలో కూడా వైసిపి అధికార౦ లోకి రావడంతో మహీధర్ రెడ్డి తనకున్న అనుభవం, సీనియారిటీతో కందుకూరులో చక్రం తిప్పాలని భావించారు.అయితే ఏ కారణం చేతనో కందుకూరులో మహీధర్రెడ్డికి పూర్తిస్థాయి స్వేచ్ఛ లభించలేదు.అధికారులు కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.దీంతో చిర్రెత్తుకొచ్చిన మహీధర్ రెడ్డి బహిరంగంగానే గళం విప్పారు.
కలెక్టరు మీద బహిరంగ విమర్శలు!
ముందుగా మానుగుంట మహీధర్ రెడ్డి ఏకంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ని టార్గెట్ చేశారు.ప్రెస్ మీట్ పెట్టి మరీ కలెక్టర్ ని ఆయన ఏకిపారేశారు.కరోనా విధుల నిర్వహణలో జిల్లా కలెక్టర్ విఫలమయ్యారని,ఆయనకు పాలనా యంత్రాంగంపై పట్టులేదని ,పాలించే తీరుపై అవగాహన లేదని మహీధర్ రెడ్డి దుయ్యబట్టారు .ఇది జరిగి నెల రోజులు కాకముందే మానుగుంట మరో అడుగు ముందుకేసి ఏకంగా ఒక ప్రభుత్వ కార్యాలయం ఎదుటే బైఠాయించారు.
జడ్పీ కార్యాలయం ఎదుట నిరసన!
ఒంగోలులో జడ్పి ఆఫీసు వద్ద సోమవారం మహీధర్ రెడ్డి బైఠాయించి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు.తాగునీటి సమస్య పై జిల్లా పరిషత్ అధికారులను ఎమ్మెల్యే మానుగుంట నిలదీశారు.కందుకూరుకు రావాల్సిన బిల్లలు పై జడ్పి సిఇఓ కార్యాలయం వద్ద బైఠాయి౦చారు.తాగునీటి పై ఒక్క సమీక్షా సమావేశం లేదని, గత సంవత్సరం ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేసినా టాక్టర్ల యజమానులకు బిల్లులు చెల్లించలేదని ఆయన ధ్వజమెత్తారు.కందుకూరు నియోజకవర్గం పై జిల్లా అధికారులకు వివక్ష ఎందుకని ప్రశ్నించారు.సీఎం గారి ఆశయాలను జిల్లా అధికారులు తుంగలో తొక్కతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి మహీధరరెడ్డి వెళ్లిపోయినప్పటికీ ఆయన చర్య రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేదిగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరి మాజీ మంత్రి కూడా అయిన మానుగుంట మహీధర్రెడ్డి వ్యవహరించడం సబబుగా లేదన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.మరి ఈ ధిక్కార ధోరణిని సిఎం జగన్ ఎలా తీసుకుంటారో వేచి చూడాలి.