ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఈ మేరకు దీనికి శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే సమయంలో ఏపీ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. ఏకంగా కుల సమీకరణలే
తెరమీదకు వచ్చి నాయకుల మధ్య గ్యాప్ బహిరంగంగానే కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. చాలాకాలంగా కసరత్తు జరిగి, వివిధ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన నేతకే కట్టబెట్టింది. దీని పట్ల కొందరు కమ్మ నేతలు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు సామాజికవర్గం నేత కన్నా లక్ష్మీనారాయణను తొలగించి సోము వీర్రాజును బీజేపీ పెద్దలు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కాపు నేతలే. అధ్యక్ష పీఠం మార్చితే ఎవరికి దక్కవచ్చు అనే చర్చల్లో భాగంగా మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ కాపు నేత సోము వీర్రాజుకు చాన్స్ దక్కింది. అయితే, ఈ ఎంపిక తదనంతర పరిణామాలు ఇప్పుడు చర్చకు కారణంగా మారుతున్నాయి.
ప్రధానంగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం. వీర్రాజు ప్రమాణ స్వీకారానికి ఏపీ బీజేపీ ముఖ్యనేతలు హాజరు కాలేదు. ప్రస్తుత ఎంపీ సుజనా చౌదరి, మాజీ ఎంపీ హరిబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వీర్రాజు పగ్గాలు చేపట్టే కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దీని వెనుక కుల సమీకరణాలే కారణమంటున్నారు. బీజేపీలో కాపు నేతల హవా పెరిగిపోతోందని కొందరు కమ్మ నాయకులు ఫీలవుతున్నారట. ఈ అభిప్రాయలను వ్యక్తీరించడంలో భాగమే ప్రమాణ స్వీకారానికి కొందరు నేతలు డుమ్మా కొట్టడం అని అంటున్నారు.