రాజకీయ నేతల పాదయాత్రల చరిత్రలోనే సుదీర్ఘమైన, రికార్డు స్థాయి పాదయాత్రను ఇటీవలే ముగించి మళ్లీ పాలిటిక్స్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు ఉద్యుక్తుడైన వైసిపి అధినేత జగన్ వచ్చీ రావడంతో తమ పార్టీ పరంగా తీసుకున్న ఒక అనూహ్యమైన నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను స్వాగతిస్తున్నట్లు జగన్ ప్రకటించడంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తుండగా సొంత పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా వైసిపి అధినేత జగన్ నిర్ణయంపై టిడిపి తారాస్థాయిలో విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఆంధ్రా ద్రోహి కెసిఆర్ తో జగన్ కుమ్మక్కు నాటకాలు దీంతో బహిర్గతమయ్యాయనే వాదనలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎంపీ కవిత కేసు వేశారనే అంశాన్నిఇప్పుడు తెరమీదకు తెచ్చి ఆ విషయానికి ఎనలేని ప్రాధాన్యత కల్పిస్తూ ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. టిడిపికి తోడు కాంగ్రెస్,సిపిఐ,సిపిఎం కూడా కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు విషయమై దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఆంధ్ర ప్రజలను పలు సందర్భాల్లో దుమ్మెత్తిపోసిన కెసిఆర్ తో జగన్ చేయి కలపడం దారుణమని, జగన్ చర్య ఎపి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన చందంగా ఉందని వారు విరుచుకుపడుతున్నారు. ఎపికి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామంటున్న కెసిఆర్ మాటలను జగన్ విశ్వసించడం హాస్యాస్పదమని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే అది తమ రాష్ట్రం కంటే అభివృద్ది చెందడానికి అవకాశం ఉంటుందనేది కెసిఆర్ అభిప్రాయమని అన్నారు. అందుకే ఇటీవల ఎన్నికల్లోనూ ఆంధ్రాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని…ఎన్నికలు కాగానే ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఎపికి ప్రత్యేక హోదాకి తమ మద్దతు అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని…జగన్ అదే విషయాన్ని ఆదరువుగా చూపుతూ వారితో చేతులు కలపడం శోచనీయమంటున్నారు.
పైగా తెలంగాణాలో ఎన్నికలు అయిపోగానే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ కెసిఆర్ కక్ష్యపూరితమైన వ్యాఖ్యలు చేశారని, ఆ కోణంలోనే ఎపిలో తలసాని వంటి వారితో కుల రాజకీయాలకు ఆజ్యం పోస్తూ రాష్ట్రంలో విభేదాలు తలెత్తేలా పావులు కదుపుతున్నారని, మన రాష్ట్రంలో కల్లోలం సృష్టించాలని..తద్వారా అభివృద్దిని అడ్డుకోవాలనే ఉద్దేశ్యమే తప్ప వారికి పొరుగు రాష్ట్రంపై సానుకూల ధృక్పథం ఎందుకు ఉంటుందని వారు నిలదీస్తున్నారు. ఎపి ప్రజలు ఈ విషయాలన్నీ అర్ధం చేసుకోగలరని, అందుకే మన రాష్ట్రం అభివృద్దికి అడ్డుపడే కెసిఆర్ తో జగన్ జత కట్టడాన్ని వారు సహించరని, జగన్ ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక తన స్వార్థ ప్రయోజనాల కోసం వారితో కుమ్మక్కవడం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
ఇక ప్రత్యర్థి పార్టీల సంగతి అటుంచితే ఇటు జగన్ సొంత పార్టీలోనూ కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ సపోర్ట్ విషయమే కాకుండా అసలు ఈ సమయంలో కెటిఆర్ తో జగన్ సమావేశం కరెక్టేనా అనే విషయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ఉన్నట్లుండి అత్యంక కీలకమైన,సున్నిత విషయాల్లో సెల్ఫ్ గోల్స్ చేస్తుంటాడని, ఇది కూడా అలాంటిదేనని ఆ పార్టీ నేతలు కొందరు అంతర్గత చర్చల్లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ తో విభేదించి తెలంగాణా ప్రత్యేక రాష్టంటగా విడిపోవడానికి కారకుడని కెసిఆర్ పై ఎపి ప్రజల్లో ఆగ్రహం ఉందని, పైగా ఆంధ్రప్రదేశ్ కు మేలు చేస్తాననే కెసిఆర్ మాటలను జగన్ ఎలా నమ్ముతున్నారని, రాజకీయంగా చూసినప్పుడు కెసిఆర్ మాటకు కట్టుబడి ఉండాలనే నియమేమీ పాటించరని పలు సందర్భాల్లో రుజువు అయిందని, మరి అలాంటప్పుడు జగన్ ఇప్పటికిప్పుడు కెసిఆర్ తో అంటకాగాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కొందరు వైసిపి నేతల అభిప్రాయంగా తెలుస్తోంది.
అయితే మరికొందరు వైసిపి నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు శ్రతువైన తెలంగాణా సిఎం కెసిఆర్ తో చెలిమి వల్ల టిడిపిపై పోరాటానికి అదనపు శక్తి సమకూరుతుందని, పైగా కెసిఆర్ తో తానే పొత్తుకు ప్రయత్నించినట్లు ఇటీవల తెలంగాణా ఎన్నికల సందర్భంగా పలు సందర్భాల్లో ప్రకటించిన చంద్రబాబు…ఇప్పుడు అదే కెసిఆర్ కు జగన్ స్నేహ హస్తాన్ని చాపడాన్ని తప్పుబడుతుండటంలో డొల్లతనం ప్రజలు అర్థం చేసుకుంటారని వారు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ఆంధ్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, కవిత పోలవరంపై కేసు వేయడం వంటివి చంద్రబాబు వారితో పొత్తుకు ప్రయత్నించిన సమాయానికి ముందే జరిగాయని, అయినా అవన్నీ తెలిసి కూడా టీఆర్ఎస్ తో పొత్తుకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించారని వైసిపి నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే కెసిఆర్ తో చెలిమి విషయమై జగన్ కాలిక్యులేషన్స్ కరెక్టేనా?…లేక ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లుగా ఎప్పటిలాగే అతి ఆత్మవిశ్వాసంతో మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?…అనేది తేలేందుకు మరి కొద్దికాలం వేచిచూడక తప్పదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?