మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైసిపిలో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై మీడియాలో,సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దగ్గుబాటి కుటుంబం అంతా వైసిపిలో చేరుతుందని కొన్ని మీడియాల్లో వార్తలు రాగా మరికొన్ని మీడియా సంస్థలు మాత్రం కేవలం దగ్గుబాటి పురంధేశ్వరి దంపతుల కుమారుడు దగ్గుబాటి హితేష్ మాత్రమే వైఎస్ఆర్సిపిలో చేరతాడని, పురంధేశ్వరి మాత్రం బిజెపిలోనే కొనసాగుతారంటూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అయితే మొత్తంమీద దగ్గుబాటి కుటుంబం నుంచి వైసిపి లోకి ఎంట్రీ అనేది మాత్రం ఖాయమనే భావించే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది.
అయితే ఈ విషయమై దగ్గుబాటి కుటుంబం నుంచి ఎవరూ అధికారికంగా ఏ ప్రకటన, వివరణ ఇవ్వకపోయినప్పటికి తాజాగా చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు మాత్రం దగ్గుబాటి కుటుంబం వైసిపిలో చేరనుందనే ప్రచారం నిజమేనని బలపరిచే విధంగా ఉన్నాయి. దగ్గుబాటి హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో గొల్లపాలెం గ్రామంలో వైసిపి పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి శుభాకాంక్షల ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీలో స్థానిక వైసీపీ నేతలతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఫోటో ఓ వైపు వుండగా మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంది. అంతేకాదు ఇదే ఫ్లెక్సీలో దగ్గుబాటి హితేష్ ఫోటో కూడా ఉండటం గమనార్హం.
అయితే వైసిపిలో చేరనున్నట్లు మీడియాలో వార్తలు రావడంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావుని కొందరు మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా సమయం వచ్చినప్పుడు ఆ విషయమై స్పష్టత ఇస్తామని చెప్పడం ఆ ప్రచారాన్ని బలపరిచే విధంగా ఉండగా…తాజాగా వైసిపి ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల వ్యవహారం దీన్ని మరింత పరిపుష్ఠం చేసే విధంగా ఉంది. కారణమేమంటే ఏకంగా వైసిపి ఫ్లెక్సీపై తన ఫోటో, తన కుమారుడి ఫోటోని ముద్రించినా దాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ మాత్రం ఖండించకపోగా మౌనం వహించడంతో ఇక ఈ కుటుంబం వైసిపిలో చేరడం లాంఛనమేననే ప్రచారం మరింత జోరందుకుంది.
ఇదిలావుంటే దగ్గుబాటి కుటుంబాన్ని వైసిపిలోకి చేర్చే విషయాన్ని వైసిపి రాజ్యసభ ఎంపి విజయాసాయిరెడ్డి తన భుజంపై వేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయనే ఈ విషయమై ఇటు జగన్ తోనూ అటు దగ్గుబాటి కుటుంబంతోనూ చర్చలు జరుపుతున్నారని వినికిడి. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి తమ పార్టీలోకి వస్తామంటే స్వాగతం పలుకుతామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్తుండటం గమనార్హం. అయితే ఈ సస్పెన్స్ వీడేందుకు ఎక్కువ సమయమేమీ పట్టదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.