బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లతో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య భేటీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మకం అయిన విషయం తెలిసిందే. తాము కలిస్తే తప్పేమిటి, ఇదేమి రహస్య భేటీ కాదని సుజనా చౌదరి వాదించినప్పటికీ ఏపీలో జనాలు దీనిపై పెద్ద ఎత్తన చర్చించుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ ఎస్ఈసీగా నియమితులు అయినందున అయన టీడీపీకి అనుకూలమని ఇప్పటి వరకు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బిజెపిలో చేరినప్పటికీ సుజనా చౌదరి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహిత మిత్రుడేనని, చంద్రబాబే ఆయనను బీజేపీ లోకి పంపారని వైకాపా నేతలు తొలి నుండి ఆరోపణ చేస్తున్నారు. ఓ పక్క నిమ్మగడ్డ వ్యవహారం సుప్రీం కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో అయన చంద్రబాబుకు అనుకూలమైన, అయన సామాజిక వర్గ బీజేపీ నేతలతో భేటీ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇది వైకాపా నేతలు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేదిగానూ ఉంది.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా కేంద్రానికి లేఖ రాసిన నిమ్మగడ్డ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉంటున్న విషయం తెలిసిందే. అయన ఎక్కడ ఉన్నా, ఎవరెవరిని కలుస్తున్నా ఏపీ ఇంటిలిజెన్స్ ఒక కన్నేసి ఉంటుందని, ఆ నేపథ్యంలోనే నిమ్మగడ్డ హైదరాబాద్ లోని ఫైవ్ స్టార్ హోటల్ లో సుజనా చౌదరి తో జరిగిన రహస్య భేటీ వ్యవహారం బయటకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. హైదరాబాద్ లో ఎంత ఏపీ ఇంటిలిజెన్స్ ఉన్నప్పటికీ స్థానిక ప్రభుత్వ సహకారం లేకుండా సాక్షాధారాలు సేకరించడం కష్టమే. ఒక స్టార్ హోటల్ లోని సీసీటీవీ ఫుటేజీ సేకరించారు అంటే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ సహకారం కూడా అందించి ఉండవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.