ఏపీలో ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలు జోరందుకున్నాయి. ప్రతి పార్టీ తమదైన శైలిలో రాజకీయం నెరుపుతూ ముందుకు సాగుతోంది. సహజంగానే ఏపీ రాజకీయాలంటే కుల సమీకరణాలే అనేది బహిరంగ రహస్యం.
అలాంటి రాష్ట్రంలో రెడ్డి, కమ్మ, కాపు రాజకీయంలో కమ్మ కులస్తుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క వలే మారిపోయిందంటున్నారు. మిగతా రెండు కులాల కంటే ఈ సామాజిక వర్గం డీలా పడిపోయిన పరిస్థితి ఉందంటున్నారు.
ఉమ్మడి ఏపీ నుంచి సమీకరణాలు పరిశీలిస్తే ప్రధాన రాజకీయ పార్టీల్లో రెడ్డి, కమ్మ కులస్తులదే ఆదిపత్యం. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల హవా కొనసాగుతుండటంతో, వరుసగా ముఖ్యమంత్రులు అవుతుండటంతో నాదెండ్ల భాస్కర్ రావు బయటకు రావడం, అదే సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడం తెలిసిన సంగతే. అనంతరం తెలుగుదేశం రూపంలో కమ్మ పార్టీ నేతలే ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్లో ఎలాగూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికే సీఎం పీఠం దక్కింది.
వైఎస్ మరణం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ స్థాపించడం రెడ్డిలకు ఏకైక కేరాఫ్ అడ్రస్గా పార్టీని మార్చేయడం తెలిసిన సంగతే. ఇదే సమయంలో టీడీపీ సైతం కమ్మ పార్టీ వైఖరిని తీసుకుంది. అయితే, ఆ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలయిన అనంతరం ఆ పార్టీలోని కమ్మనేతలే నాయకత్వ సమస్యతో పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఇది వరకు వారి చూపు బీజేపీ వైపు ఉండేది. ఇప్పుడు వారిలో ఆ ఫీలింగ్ మారిపోయిందట.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవలి కాలం వరకు పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు కాపు నేతలే. ఆ పార్టీ వైఖరి కూడా ఏపీలో నిరాదరణకు గురైన కాపులకు తమ పార్టీ ఎర్ర తివాచి పరుస్తోంది అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో కాపుల నాయకత్వంలోని పార్టీలోకి వెళ్లి పనిచేయాలా అని కమ్మ నేతలు ఫీలవుతున్నారట. ఇటు వైసీపీ రూపంలో రెడ్ల దూకుడు, టీడీపీకి భవిష్యత్ లేని పరిస్థితి, బీజేపీలో కాపులదే రాజ్యం అనే సిగ్నల్స్ నేపథ్యంలో….కమ్మ సామాజికవర్గానికి రాబోయే కాలంలో సీఎం సీటు దక్కడం కష్టమేనని కలవరం మొదలైనట్లుగా చెప్పుకొంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?