అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు హైదరాబాదులో కేటాయించిన భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు.
హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆమోదంతో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహం నిన్న తెలంగాణ ప్రభుత్వానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఐవైఆర్ సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఈ భవనాలను సచివాలయంగా కొనసాగించాలనే ఉద్దేశం తెలంగాణకు లేనప్పుడు మిగిలిన అన్ని విభజన అంశాల పరిష్కారానికి దీనిని ముడి పెట్టి ఉండాల్సింది అని ఐవైఆర్ పేర్కొన్నారు. చాలా విభజన అంశాలలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు విభన్నంగా ఉన్నాయని ఐవైఆర్ పేర్కొన్నారు.