‘ఎవరో జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలి అయినారు..’.. అని తెలుగులో ఒక ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ఉంది. పై పల్లవి తరహాలానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉండిపోయింది. ఉమ్మడి ఏపీని విభజనకు సంబంధించి ఎందరో వెలిగించిన జ్వాలకు బలి అయిపోయింది.. పోతోంది మాత్రం ఏపీ ప్రజలే. ఇదంతా ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించే..! ఏపీ క్యాపిటల్ ఏదంటే ప్రస్తుం ఠక్కున ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘అమరావతి’ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. నిర్మాణం గురించి పక్కనపెడితే.. ఏపీ రాజధాని ‘అమరావతి’ అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అయితే.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని మార్పు ప్రకటించారు సీఎం జగన్. ‘మూడు రాజధానులు’ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. దీంతో రాష్ట్రంలో అసలు సందిగ్ధత మొదలైంది.
సంచలనం రేపిన సీఎం జగన్..!
2019 శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ‘మూడు రాజధానులు’ ప్రకటించి అతిపెద్ద సంచలనానికి తెర తీశారు. దీంతో కొత్త ఆందోళనలు తెర మీదకు వచ్చాయి. చంద్రబాబుపై నమ్మకంతో 29 గ్రామాల రైతులు నిండుగా పంటలు పండే భూములు రాజధాని కోసం ఇచ్చేశారు. అక్కడక్కడా సగం.. సగం నిర్మాణాలతో ప్రస్తుతం అటు పంటలకు.. ఇటు అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయాయి. దీంతో ప్రతిపక్షం రంగంలోకి దిగింది. భూములిచ్చిన రైతులూ దిగారు. ఆందోళనలు, ఉద్రిక్తలు మొదలయ్యాయి. ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. హైకోర్టుకు వెళ్లింది ప్రతిపక్షం. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చింది. దీంతో దాదాపు ఏడాదిన్నరగా రాష్ట్ర రాజధాని ఏదంటే ‘ష్.. గప్ చుప్..!’ అని ఎవరికివారు చెప్పుకోవాల్సిన పరిస్థితి.
చంద్రబాబు డీలా పడిపోయారా..?
రాజధాని మార్పుపై హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. పూర్తి విచారించాల్సి ఉంది.. అని పేర్కొంది. టీడీపీ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన వైసీపీ ప్రభుత్వం దానిని ఇప్పటికీ నిరూపించలేక పోయింది. ఆ ఆరోపణలను ప్రభుత్వం రుజువు చేసుంటే కోర్టు స్పందన ఎలా ఉండేదో..! మరోవైపు.. రాజధాని మార్పు అంశంలో టీడీపీ ఉలికిపాటుకు అసలు కారణం.. రైతులే..! చంద్రబాబును నమ్మి భూములిచ్చిన రైతులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈ అభాండం నుంచి చంద్రబాబు తప్పించుకోవాలి..! అందుకే రైతుల తరపున పోరాటం చేస్తున్నా.. ఈ ఉద్యమాన్ని రాష్ట్రమంతా విస్తరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. జగన్ నిర్ణయానికి అదే రెండు జిల్లాల నుంచి తప్పితే పెద్దగా వ్యతిరేకత లేదు. దీంతో ప్రభుత్వం కోర్టుల్లో పోరాడుతోంది.
కొత్త చీఫ్ జస్టిస్ ఏమంటారో..?
ఏపీ రాజధాని మార్పుపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. అయితే.. ఏపీ హైకోర్టు ఇచ్చే తీర్పే ప్రధానం కానుంది. ఈ అంశంలో బదిలీ అయిన హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ వేశారు. ప్రభుత్వ నిర్ణయంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని తేల్చి చెప్పారు. కేసు మధ్యలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆయన సిక్కింకు బదిలీ అయ్యారు. అక్కడి నుంచే అరూప్ గోస్వామి ఏపీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వచ్చారు. దీంతో ఇప్పుడు రాజధాని అంశం మళ్లీ కీలకంగా మారింది. ఈ అంశంపై ఏడాదిగా అధ్యయనం చేసిన మహేశ్వరి రిపోర్టులను గోస్వామి అక్కడి నుంచే మొదలుపెడతారా.. లేదంటే మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసుకుని తీర్పు ఇస్తారో ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. మొదటి నుంచీ మెదలుపెడితే రాజధాని అంశం మరింత ఆలస్యం అవుతుంది. అయితే..
సుప్రీంకోర్టు ఏమంటోంది..?
రాయలసీమకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో.. రాజధాని తరలింపుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ఓ పిల్ వేశారు. దీనిపై సుప్రీం స్పందించింది. రాజధాని అంశంలో ఏపీ హైకోర్టు తీర్పే శిరోధార్యం. పూర్తి తీర్పు వచ్చాక మాత్రమే మా జోక్యం ఉంటుందని స్పష్టం చేసింది. దీనిమీద స్టే ఇవ్వలేమంటూ తెలిపింది. దీంతో ఇప్పుడు బాల్ పూర్తిగా ఏపీ హైకోర్టులోనే ఉంది. మరి కొత్తగా వచ్చిన చీఫ్ జస్టిస్ ఏం తీర్పు ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. మహేశ్వరి ఇచ్చిన స్టేను కొనసాగిస్తారో.. తాను కొత్తగా స్టడీ చేసి ఏ నిర్ణయం వెలువరుస్తారో చూడాలి. దీంతో ఏపీ ప్రజల భవిష్యత్ ను నిర్ణయించే ‘రాజధాని’ ఎక్కడ ఉంటుందో.. ఎప్పటికి వస్తుందో.. కాలమే చెప్పాలి.