తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సమస్యలు తీరుస్తూ ప్రభుత్వం చేపట్టిన అనేక విషయాల గురించి ముచ్చటిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ట్విట్టర్ ద్వారా ప్రజలతో ముచ్చటించారు. “ASK KTR” పేరిట జరిగిన ఈ సంభాషణ లో నెటిజన్లు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కృష్ణా జలాలు కరోనాపై పోరు ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అయోధ్యలో రామాలయ నిర్మాణం పై ఇలా అనేక అంశాలపై కేటీఆర్ స్పందించారు. ఏపీ సీఎం వైయస్ జగన్ తో సత్సంబంధాలు బాగానే ఉన్నా గాని కృష్ణా జలాల అంశంలో తెలంగాణ హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల విషయంలో న్యాయ పరంగా రాష్ట్రానికి చెందాల్సిన వాటా కోసం పోరాడుతున్నామని, ఇప్పటికే సుప్రీం కోర్టు లో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మరోపక్క కరోనా చికిత్స విషయంలో అధిక వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిర్యాదులు అందిన ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదే రీతిలో రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు 23 వేల నుండి 40 వేల వరకు రాబోయే రోజుల్లో పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ “ఆయుష్మాన్ భారత్” పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ స్కీం అత్యుత్తమైనదీ అని అన్నారు.
అయోధ్యలో రామాలయం గురించి స్పందిస్తూ కులమతాలకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చే రామరాజ్యం రావాలన్నదే తన కోరిక అని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగానే ఉందని, కరోనా రికవరీ రేటు విషయంలో దేశంలో మెరుగైన స్థానంలో తెలంగాణ ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎంఎంటీఎస్ సిటీ బస్సులు, మెట్రో సర్వీసులు కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే తిరుగుతాయని, కేంద్రం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఎంఎంటీఎస్ సిటీ బస్సులు మెట్రో సర్వీసులు రాష్ట్రంలో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.