ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సన్నిహితుడు అనే పేరున్న పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు మీడియా దృష్టిని ఆకర్షించారు.
విజయసాయిరెడ్డికి ఉపశమనం ఇచ్చే నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయనకు సీఎం జగన్ దసరా గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా స్వయంగా తన బాబాయి ద్వారా అందించారు. అయితే, దీనిపై కొందరు మండిపడుతున్నారు.
అసలేంటి పింక్ డైమండ్ కథ?
తిరుమల శ్రీవారు పింక్ డైమండ్ కలిగి ఉన్నారని, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆదీనంలో ఉందని గతంలో పలువురు పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో విజయసాయిరెడ్డి సంచలన విమర్శలు చేశారు. పింక్ డైమండ్ చంద్రబాబు నివాసంలో ఉందని ఓసారి, జెనీవాలో రూ.500 కోట్లకు వేలం వేశారని మరోసారి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు సైతం ఇదే కామెంట్లు చేశారు. అప్పట్లో టీటీడీ ధర్మకర్తల మండలి సిఫారసుతో ఈవో సింఘాల్ తిరుపతి కోర్టులో వారిద్దరిపై రూ.200 కోట్లకు పరువు నష్టం కేసు వేశారు. కోర్టు ఫీజు నిమిత్తం రూ.2కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేశారు. అయితే, ఆ కేసు నుంచి విజయసాయిరెడ్డి, రమణదీక్షితులను కాపాడేందుకే ఆ దావాను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది.
జగన్ బాబాయి ఏం చేశారంటే…
పింక్ డైమండ్ విషయంలో విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులు పై, గతంలో వేసిన పరువు నష్టం దావా పిటీషన్ వెనక్కు తీసుకోవాలని నిర్ణయం టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నారు. పాలకమండలిలో ఇప్పటికే ఈ విషయం పై తీర్మానం కూడా చేసేశాయి. తద్వారా విజయసాయిరెడ్డికి వైఎస్ జగన్ దసరా గిఫ్ట్ ఇచ్చినట్లయింది.
టీడీపీ మండిపడుతోంది
మరోవైపు ఈ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంటోంది. టీడీపీ హయాంలో పింక్ డైమండ్ పోయిందంటూ రమణ దీక్షితులు, విజయసాయరెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ రూ.200 కోట్లకు వేసిన పరువు నష్టం దావాను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. శ్రీవారిపై నమ్మకం ఉందని విజయసాయిరెడ్డి ప్రకటించినందున కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు గుట్టుచప్పుడు కాకుండా టీటీడీ తీర్మానం చేయడం వెంకటేశ్వర స్వామివారిని, స్వామిని నమ్ముకున్న భక్తులను అవమానించడమే, మనోభావాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు. “అబ్బాయ్ సేవలో బాబాయ్ తరించే కార్యక్రమంలో భాగంగా పరువు నష్టం కేసును ఉపసంహరించుకున్నారా? పరువు నష్టం కేసులో కోర్టుకు చెల్లించిన రూ.2 కోట్లు వదులుకుంటామని చెప్పే అధికారం పాలకమండలి సభ్యులకు ఎవరిచ్చారు? అదేమైనా మీ జేబుల్లో నుంచి తీసిచ్చిన సొమ్మా?“ అంటూ విరుచుకుపడ్డారు.