ఆంధ్రప్రదేశ్లో బంపర్ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొని అభివృద్ధి- సంక్షేమ పథకాల ఎజెండాతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
గతంలో తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లనే తిరిగి చేస్తున్నారా? రాజకీయ ఎత్తుగడలు ఆయన్నే ఇబ్బంది పెట్టేలా జరుగుతున్నాయా? ప్రస్తుతం అదే చర్చ జరుగుతోంది.
జగన్కు మైనస్ అవుతున్న ఆ లెక్కలు?
అధికార పార్టీ అండ కోసం కావచ్చు, రాజకీయ అవసరాలు కారణం కావచ్చు వివిధ పార్టీల నేతలు వైఎస్ఆర్సీపీ గూటికి చేరుతున్నారు. పార్టీ సైతం ఇలాంటి నేతలను ఎంకరేజ్ చేస్తోంది. అయితే, అలాంటి నేతల లెక్కలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మైనస్గా మారుతున్నాయంటున్నారు. వివిధ చోట్ల జరుగుతున్న పరిణామాలు దీనికి నిదర్శనమని పలువురు అంటున్నారు.
కడప నుంచి కృష్ణా వరకు….
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాకా అయిన కడప నుంచి మొదలుకొని ఆసక్తికర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కృష్ణా జిల్లా వరకు ఆపరేషన్ ఆకర్ష్ పరిణామాలు ఇబ్బందిని సృష్టిస్తున్నాయంటున్నారు. కడప జిల్లా పరిణామాలు చూస్తే…ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప లో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇలా గెలిచిన వారిలో జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒకరు. అయితే, ఆయనపై తాజాగా కొత్త ప్రచారం జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన రామసుబ్బారెడ్డిని వైసీపీలోకి తీసుకొని వచ్చింది మొదలు సుధీర్ రెడ్డి హర్టవుతున్నారట. ఇప్పుడు ఇది పీక్స్ కు చేరిపోయిందట. రామసుబ్బారెడ్డి ఏకంగా ఓ ఆఫీసు తెరిచి వైసీపీ ముఖ్య నేతగా చెలామణి అవడం జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారట. ఈ మేరకు మీడియాలో వార్తలు అవడం రచ్చ రచ్చగా మారింది.
కడపలోనే ఇలా జరుగుతోంది కదా జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాకా అయిన కడపలో సొంత పార్టీలోనే ముసలం పుట్టిందనే ప్రచారం ఆయన ప్రత్యర్థి వర్గాలు చేస్తున్నారు. రామసుబ్బారెడ్డి పెత్తనం చెలాయించడమే ఇబ్బందికరంగా ఉందనుకుంటున్న సమయంలో వైసీపీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని నేతలు మండిపడుతున్నారట. పాత టీడీపీ వాళ్లకే కడప జిల్లాలో.. నియోజకవర్గంలో పనులు కాంట్రాక్టులు దక్కుతున్నాయని సుధీర్ రెడ్డికి అనుచలు ఫిర్యాదు చేశారట. దీంతో ఎవరైనా తన దగ్గర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తే, వైసీపీ పేరు ఎత్తితే కోపంతో చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ గాలిలో అంత మెజార్టీ వస్తుందా? అంటూ ప్రశ్నించారని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో కూడా రచ్చే
ఇక ప్రసతుత రాజధాని అమరావతి ఉన్న కృష్ణా జిల్లాలో మరో సమస్య. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న వంశీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్చార్జినని చెప్పడమే కాకుండా ఎమ్మెల్యేను అని కూడా స్వయంగా ప్రకటించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ వైసీపీ కండువా కప్పుకోలేదు. అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని వైసీపీ పార్టీ ఇంచార్జి అని చెప్పుకోవడం ఏమిటి అనేది సహజంగానే తెరమీదకు వచ్చే డౌట్. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేతలుగా దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. క్యాడర్ కూడా వీరి వెనుకే ఉంది. ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో సహజంగానే వల్లభనేని వంశీకి వైసీపీ క్యాడర్ సపోర్ట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ నియోజకవర్గం రాజకీయం రచ్చరచ్చగా మారుతోంది. మొత్తంగా తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస జగన్ ఈ రాజకీయాలతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందంటున్నారు.