“డిక్లరేషన్” పై ఇంత రచ్చ జరిగినా సైలెంట్ గా ఉండడానికి జగన్ ఏమి చిన్న పిల్లాడు కాదు..!
“డిక్లరేషన్” విషయంలో వైసీపీ నాయకులు తోచింది మాట్లాడినా జగన్ నియంత్రించకపోవడానికి ఆయనేమి తెలియని వాడు కాదు..!!
“డిక్లరేషన్” వివాదం ప్రభుత్వాన్ని చుట్టూ ముడుతున్నా.., బీజేపీ రంకెలేస్తున్నా.., టీడీపీ మొత్తుకుంటున్నా.., స్వామీజీలు గింజుకుంటున్నా.. వ్యతిరేక మీడియా అరుస్తున్నా..!! తాను అనుకున్నది చేసేసారు. తిరుమల వెళ్లారు, “డిక్లరేషన్” ఇవ్వకుండానే స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నారు, పైగా తిరునామం పెట్టుకున్నారు. అంతా ముగించుకుని వచ్చేసారు..!! అసలు ఈ “డిక్లరేషన్” అంశం ఓ వ్యూహమా..? వివాదమా..?
ఇది జగన్ వ్యూహమా..? దీనిలో రెండు మతాలు, ఆ సెంటిమెంట్లు… మూడు పార్టీలు, ఆ నాయకులు పావులుగా మారారా..?
లేదా ఇది జగన్ చిక్కుకున్న వివాదమా..? దీని ఫలితంగా ఏమైనా అప్రమత్తత కావాల్సి ఉందని జగన్ యోచిస్తున్నారా..?
ఈ వ్యూహమేమిటో.. వివాదమేమిటో చూడాలనే మరింత లోతుగా వెళ్లి తెలుసుకోవాల్సిందే..!!
గుప్పిట్లో ఉన్న ఓట్లు పోగొట్టుకోరుగా..!!
రాష్ట్రంలో 2014 ఎన్నికలయినా.., 2019 ఎన్నికలయినా.. ఎప్పుడైనా వైఎస్ జగన్ అంటే కళ్ళు మూసుకుని ఓటేసే వర్గాల్లో క్రిష్టియన్స్ ఉంటారు. క్రిష్టియానిటీలో ఉన్న ఓట్లలో దాదాపు 70 శాతం జగన్ గుప్పిట్లో ఉన్నట్టే. ఇది కాదనలేని సత్యం. అటువంటి క్రిష్టియన్లకు సెంటిమెంట్లు బాగా ఎక్కువ. “విగ్రహారాధనకి వ్యతిరేకం. దేవాలయాలకు వెళ్లరు. ప్రసాదం ముట్టుకోరు. హిందూ దేవతలు అంటేనే ఒకరకమైన భావనలో ఉంటారు.” అటువంటి వారు తమకు ప్రతినిధిగా భావిస్తున్న జగన్ హిందువులకు దగ్గరవుతున్నారు అంటే అంగీకరించలేరు కదా..!? ఆ ఓట్లు గుప్పిట నుండి జారిపోతాయి కదా..?
* అయితే ఇక్కడ మరో పాయింటు ఆలోచించాలి..! జగన్ క్రిష్టియన్ అయినప్పటికీ పట్టింపులు లేకపోవచ్చు. అందుకే పుష్కర స్నానం చేశారు, తండ్రికి పిండ ప్రధానం చేసారు, ఋషికేశిలో యాగం చేసారు, శారదా పీఠానికి భక్తుడిగా మారారు..!
* కానీ క్రిష్టియన్లకు పట్టింపులు ఉంటాయి. అందుకే తమ జగన్ హిందువులకు బాగా దగ్గరవడాన్ని తట్టుకోలేకపోవచ్చు. ఈ క్రమంలోనే జగన్ కొద్దీ రోజులుగా హిందూ సంప్రదాయాలు ఆచరిస్తుండడం ఆ వర్గానికి నచ్చకపోవచ్చు. పైగా ఈ సమయంలో టీటీడీ డిక్లరేషన్ ఇచ్చేస్తే.. ఇక జగన్ ని ఆ వర్గాలు అంతగా ఆదరించకపోవచ్చు. “తమ” అనుకోకుండా, బయటి వాడిగానే చూసే ఆలోచన చేయవచ్చు..? అలా ఆ గుప్పిట్లో ఉన్న ఓట్లు పోవచ్చు..? ఇవన్నీ ఆలోచించుకుని “నేను మీ వాడినే. నేను నాడు – నేడు ఒకేలా ఉన్నాను. అప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు.
ఇప్పుడు ఇంత గొడవ జరుగుతున్నా ఇవ్వలేదు..!” అని చెప్పే క్రమంలోనే ముందు నుండి డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే.. ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి ఇవ్వలేదేమో..!! బహుశా ఇదే వ్యూహం కావచ్చు..!!
* హిందూ ఓట్లతో ఎప్పుడూ సమస్య ఉండదు. కులాలు, కుంపట్లుతో ఈ ఓట్లు నిత్యమూ చీలి ఉంటాయి. జగన్ వి జగన్ కె, బాబువి బాబుకే ఉంటాయి. అందుకే హిందూ ఓట్ల విషయంలో జగన్ పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. తన సంప్రదాయాలు తాను పాటిస్తూనే, ఎక్కడా మచ్చ లేకుండా ఉంటె చాలు.
బీజేపీతో స్నేహం సంకేతాలు లేకుండా..!!
మరో కీలక అంశం ఉంది. వైసీపీకి బీజేపీకి బంధం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అన్ని జగన్, బీజేపీతో స్నేహం అనే సంకేతాలను బయటపెడుతున్నాయి. బీజేపీ ఒత్తిళ్లు జగన్ పై ఉన్నాయని అనుకుంటున్నారు. వీటి నుండి జగన్ తేలిగ్గా బయట పడాలి అంటే తనలో మార్పు లేదు.., హిందూ పార్టీ అయిన బీజేపీతో కలిసేది లేదు.. తాను ఎన్ని వివాదాలను అయినా పట్టుంచుకోను., “మనం మనమే.., నేను మీతోనే” అనే సంకేతాలను ఇవ్వడమూ ఈ వ్యూహంలో భాగమే. అందుకే వ్యూహాత్మకంగా వివాదం చేసి, ఇదిగో ఇంత పెద్ద వివాదం అయినా నేను తలొగ్గలేదు. అనే వ్యూహం కావచ్చు..!!
వైవీ రూపంలో వివాదమూ ఉంది..!!
వ్యూహం చెప్పుకున్నాం..!! ఇప్పుడు వివాదం చెప్పుకోవాలి. ఒకవేళ పైన చెప్పుకున్న వ్యూహం గనుక లేకపోతే.. వివాదం గురించి ఆలోచించాల్సిందే. వారం రోజుల ముందే “జగన్ డిక్లరేషన్ ఇవ్వరు” అని టీటీడీ చైర్మన్ వైవీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది. టీటీడీ డిక్లరేషన్ అంశాన్ని ఎందుకు పైకి తీసుకురావాల్సి వచ్చింది. ఉద్దేశ పూర్వకంగా వివాదం ఎందుకు చేయాలి..? ఈ వ్యాఖ్యల వెనుక అంతరార్ధం ఏమిటి..? ఏ ఉద్దేశాలు, వివాదాలు తెలియకుండానే అలా మాట్లాడేసారా..? ఒకవేళ వైవీ ఏమి ఊహించకుండా, తెలియకుండా మాట్లాడేస్తే మాత్రం పైన చెప్పుకున్న వ్యూహం లేనట్టే. కానీ వైవీ ఏమి చిన్న పిల్లాడు కాదు. రాజకీయం తెలియని వాడు కాదు. అందుకే వ్యూహం మాత్రం ఉన్నట్టే. దాని వెనుక వివాదమూ ఉన్నట్టే. ఇది ఒక సంకేతం. జగన్ మారారు. తన వర్గానికి దూరం కారు. అలా అని హిందూ వ్యతిరేకి మాత్రం కాదు. జగన్ అనే వాడు “హిందూ సంప్రదాయాలను గౌరవించే, ఆచరించే, హిందూ దేవుళ్లను కొలిచే, విశ్వాసాలను నమ్మే” ఒక ఫక్తు క్రిష్టియన్..!!