శ్రీకాకుళం, జనవరి 8: రాష్ట్రంలో పేద పిల్లలందరినీ చదివించే బాధ్యత తీసుకుంటామని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 340రోజు మంగళవారం ఇచ్చాపురం నియోజకవర్గంలో కొనసాగింది. జగతి శివారు నుండి కవిటి, తుత్తుడిపుట్టుగ క్రాస్, బోర్రపుట్టుగ క్రాస్ మీదుగా రాజపురం, అగ్రహారం గ్రామాల వరకూ జగన్ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
చంద్రబాబు నిత్యం అబద్దాలు చెబుతూ పరిపాలనను భ్రష్టుపట్టించారని, ఈ సర్కార్లో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వైసిపి అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు అన్ని తీర్చేందుకు నవరత్న పథకాలను అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ముగింపు సభకు భారీ ఏర్పాట్లు
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుండి 2017 నవంబర్ ఆరవ తేదీన జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల తొమ్మివ తేదీ ఇచ్చాపురంలో ముగుస్తుంది. ముగింపు సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర ముగింపు సూచికంగా ఆకర్షనీయంగా నిర్మించిన స్తూపాన్ని ఇక్కడ ఆవిష్కరించనున్నారు.