jagan: ఏపిలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ అధికారులు ఏ మాత్రం సహకరించడం లేదు. నిన్నటి వరకూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. కరోనా పరిస్థితిలో ఎన్నికలు పెట్టడం ఏమిటంటూ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైసీపీ నేతలు కూడా వ్యాక్సినేషన్ జరుగుతుండగా ఎన్నికలు పెట్టడం ఏమిటని విరుచుకుపడ్డారు. అయితే కరోనా లాక్ డౌన్ అనంతరం వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ, అసెంబ్లీ, పంచాయతీ, నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిరాటంకంగా జరిగాయంటూ ఈనాడు పత్రిక ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.
కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 19న రాజ్యసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిందనీ, నాటి నుండి నేటి వరకూ వివిధ రాష్ట్రాల్లో వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని ఈనాడు పేర్కొంది. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు, 11 రాష్ట్రాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో రాజ్యసభకు, అయిదు రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటక లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయాన్ని ప్రస్తావించింది.
అక్టోబర్ 28 నుండి నవంబర్ ఏడు వరక మూడు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయనీ, నవంబర్ మూడున మధ్యప్రదేశ్ లో 28, గుజరాత్ లో ఎనిమిది, ఉత్తరప్రదేశ్ ఏడు, జార్ఘండ్, కర్నాటక, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో రెండేసి స్థానాల్లో, ఛత్తీస్ ఘడ్, హరియానా లో ఒక్కో స్థానానికి, తెలంగాణ లో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయని ఈనాడు వెల్లడించింది. నవంబర్ 7న మణిపూర్ లో అయిదు అసెంబ్లీ స్థానాలకు, బీహార్ లోని వాల్మీకినగర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు, నవంబర్ 9న ఉత్తరప్రదేశ్ లో పది, ఉత్తరాఖండ్ లో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరిగిన విషయాన్ని గుర్తు చేసింది. అదే విధంగా నవంబర్, డిసింబర్ నెలలో నాలుగు దశల్ల రాజస్థాన్ లో పంచాయతీ ఎన్నికలు, డిసెంబర్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు, 8 నుండి 14వ తేదీ వరకూ కేరళలో, 11న రాజస్థాన్ లో, 22,27 తేదీల్లో కర్నాటకలో రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయనీ అదే విధంగా ఈ నెల 15న మహరాష్ట్రలో 14,234 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఈనాడు ప్రస్తావించింది.