(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రజల్లో చెదిరిపోని అభిమానం ఉంది. నమ్ముకున్న నాయకుల్లో ఎప్పటి వరకైనా నడిచే సుద్గుణం ఉంది. ఇన్ని ఉన్నా జగన్ కు ఏదో వెలితి కనిపిస్తోంది. ఆ వెలితిని తీర్చుకునే క్రమంలోనే ఏమిటా అని ఆలోచిస్తే ప్రత్యర్థి ఎక్కడో ఒక చోట బలంగా కనిపించడం. అందుకే ఆ ప్రత్యర్థి ప్రతిపక్ష హోదా లాగేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన జగన్ కు వచ్చింది. వచ్చిందే తడవుగా తన లక్ష్యానికి భిన్నంగా, తన తత్వానికి వ్యతిరేకంగా నడుుచుకుంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. అవును జగన్ లక్ష్యం ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవడం కాదు. టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గించడం, చంద్రబాబు ప్రతిపక్ష హోదా లాగేయ్యడం. చంద్రబాబు, టీడీపీ నైతికను దెబ్బతీయడం. అందుకే ఈ ఎమ్మెల్యేల చేరికలన్నీ.
ఇక ఈ జిల్లాలో టీడీపీ పని అయిపోయినట్లనా?
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాస్త తల ఎత్తుకునే విధంగా ఓట్లు, సీట్లు వచ్చాయి అంటే అందులో విశాఖ జిల్లా ఒకటి. హుద్ హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు చేసిన పని వల్లనో, విశాఖ నగరంలో చంద్రబాబు బస చేసి కాస్తో కూస్తో కరుణ చూపించారన్న ఆలోచన వల్లనో విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాలుగు స్థానాలు వచ్చాయి. విశాఖ ఎంపి స్థానమూ కొట్టేసేదే. కాకపోతే జనసేన తరపున జెడి లక్ష్మీనారాయణ నిల్చోవడం వల్ల ఈ ఓట్లు అటు డైవర్ట్ అియి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకే తెలుగుదేశం పార్టీ బలం ఉన్న చోట పార్టీని బలహీనం చేయాలనే ప్రాధమిక లక్ష్యంలో భాగంగా విశాఖ జిల్లాపై జగన్ దృష్టి పెట్టారు. విశాఖ జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో సాధ్యమైనంత వరకూ లాగేయ్యాలనేది జగన్ టార్గెట్, అందుకే గంటా శ్రీనివాసరావుకు ఎప్పుడో గాలం వేసినప్పటికీ గంటా తత్వం, గంటా రాజకీయ మనుగడ లేమి, గంటాకు ఉన్న అవినీతి మరకలు ఆయనను అక్కడితో వదిలివేశాయి. గంటా చేరుతారో లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి జై కొట్టారు. ఇదే బాటలో వెలగపూడి రామకృష్ణ కూడా ఉన్నారు అనేది వైసీపీ వర్గాల సమాచారం. ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు జాయిన్ అయి గంటా కూడా అటు ఇటుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే మిగులుతారు. ఆయన కూడా ఉంటారో పోతారో తెలియని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది జరిగితే ఈ జిల్లాలో టీడీపీకి నాలుగు నుండి సున్నాకు పడిపోవడం ఖాయమే.
అక్కడితో ఆగుతారా..!పక్క జిల్లాకు కూడా వస్తారా..?
విశాఖపట్నం జిల్లా తరువాత తెలుగుదేశం పార్టీకి నాలుగు స్థానాలు ఇచ్చిన జిల్లా తూర్పు గోదావరి. ఈ జిల్లా నుండి కూడా టిడీపీ నుండి వైసీపీలో దూకేందుకు కొంత మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అనేది వైసీపీ వర్గాల సమాచారం. ఎర్రంనాయుడు కుమార్తె, టీడీపీ ఎంపి రామ్మోహన్ నాయుడు సోదరిగా ఉన్న ఆదిరెడ్డి భవానీ పేరు ఎప్పటి నుండో వినిపిస్తోంది. అయితే స్వతహాగా భవానీ పుట్టినప్పటి నుండి ఎర్రం నాయుడు టీడీపీలో చక్రం తిప్పేవారు. సో ఆమె అంత ఈజీగా వైసీపీలో చేరే అవకాశం ఉండదు. కానీ ఎర్రంనాయుడు కుటుంబం నుండి ఎవరో ఒకరు వైసీపీలోకి వస్తే ఉత్తరాంధ్రలో కొంత ప్రభావం చూపించవచ్చు అనేది వైసీపీ భావనగా కనిపిస్తోంది. అందుకే ఆదిరెడ్డి భవానీని కూడా వైసీపీలోకి లాగేందుకు అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాత ఈ జిల్లాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా గాలం వేసేలా చూస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ అయితే బలంగా ఉందో అక్కడే బలహీనం చేయాలనే టార్గెట్ తో జగన్మోహనరెడ్డి రాజకీయం నడుపుతున్నట్లు చెప్పుకోవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?