వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 14 నెలలు ముగిసింది. ప్రస్తుతానికి సంక్షేమ బాటను ఎంచుకున్న అయన ఆ రధాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నిధులు ఉన్నా లేకపోయినా, రాష్ట్రానికి ఆదాయం ఉన్నా లేకపోయినా, వాటితో నిమిత్తం లేకుండా ఎలాగోలా తెచ్చి సంక్షేమ రధాన్ని ఉరకలు పెట్టిస్తున్నారు.
ఏటా 45 వేల కోట్లకు మించి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. పాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు ప్రగతి కనిపించాలి. పనులు కనిపించాలి. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలి. అధికారులు అందుబాటులో ఉండాలి. ప్రజలు అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలకు కావాల్సింది ఇవ్వాలి. మరి అది జరిగేలా చూడడానికే జగన్ సరికొత్త ప్రణాళిక వేసుకున్నారు. రానున్న ఆరు నెలల నుంచి దాన్ని అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదేమిటో చూడాలంటే..
కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక ముందడుగు
పరిపాలనలో సులువుగా ఉండాలన్నా, ప్రజలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలన్నా చిన్న జిల్లాలతోనే సాధ్యం అవుతుంది. అది 2016లో తెలంగాణలో జిల్లాల విభజన ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించారు. అందుకే ఏపీలో కూడా జిల్లాల విభజన అంశం ఏనాటి నుండో చర్చలో ఉంది. నిజానికి సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఏపీలో జిల్లాలను విభజిస్తారని అనుకున్నప్పటికీ చంద్రబాబు ఆ సాహసం చెయ్యలేదు. అయితే జగన్ మాత్రం ఎన్నికల టైంలోనే బహిరంగంగా హామీ ఇచ్చారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజక వర్గాన్ని జిల్లాగా మారుస్తామన్నారు. ఆ ప్రక్రియలో భాగంగా జిల్లాల విభజనకు సంబంధించి ఒక కమిటీని నియమిస్తూ ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుఅవ్వనున్నాయి.
ప్రాంతీయ బోర్డుల ద్వారా మరింత ప్రగతి
జిల్లాలను చిన్నవిగా చేస్తారు సరే. మరి అన్ని జిల్లాలను రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ చేయడం కష్టం కదా. ఇప్పుడు వరకు అదే జరుగుతుంది. దానిలో మార్పు తీసుకురావాలంటే ప్రాంతీయ స్థానిక పరిపాలన తీసుకెళ్లాలి కదా. ఇప్పుడు జగన్ ఆలోచన అదే. అందుకే రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించాలని సీ ఎం జగన్ నిర్ణయించారు. విజయనగరం, కాకినాడ, ఒంగోలు, కడప నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు ముఖ్య పట్టణాలను ప్రాంతీయ నగరాలుగా ఎంపిక చేసి వాటిని ప్రాంతీయ బోర్డులుగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాలన పర్యవేక్షణ చేయనున్నారు. ప్రతి ప్రాంతీయ బోర్డు లోనూ ఓ ప్రజా ప్రతినిధి చైర్మన్ గా వ్యవహరిస్తారు. అయన తో సంయుక్తంగా ఐఏఎస్ అధికారి వైస్ చైర్మన్ గా ఉంటూ అన్ని బాధ్యతలు చూసుకుంటారు. అంటే ఓ వైపు పాలకుడు, మరో వైపు అధికారి ఇద్దరు ప్రాంతీయ పాలనను పర్యవేక్షణ చేస్తారు. వారితో పాటు ఏడుగురు సభ్యులు కూడా ఉంటారు. వీరిలో కూడా కొందరు అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు ఉండేలాగా సీఎం జగన్ చూస్తుకుంటున్నారు. ఇలా జిల్లాల విభజన, ప్రాంతాల విభజన ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనేది అయన లక్ష్యం.