భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ వామపక్షాలు, బీఎస్పి బలపర్చిన జనసేన అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ముందుగా నిర్మలాదేవి ఫంక్షన్ హాలు నందు వేదపండితులు, చర్చి ఫాదర్లు, ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనాలు అందించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భీమవరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భీమవరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజకీయ భావజాలంతో ముడిపడి ఉండాలి కానీ కులంతో కాదని, తనకు కులం మతం లేదు మానవత్వమే ఉందని అన్నారు. ఈ సిద్ధాంతాలను తాను ఎంత భుజాన వేసుకుంటానో చేసి చూపుతానని పవన్ తెలిపారు. అభివృద్ధిలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానని పవన్ చెప్పారు.
ఇంత వరకు ఏ ఎమ్మెల్యే ఏమి చేశారో తెలియదు, నన్ను భీమవరం ఎమ్మెల్యేని చేయండి, నాకు అవకాశం ఇస్తే భీమవరంను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా, విశ్వనగరంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
తాను నడిచే నాయకుడిని కాదనీ, ప్రజల సేవకుడిని అని పవన్ అన్నారు. ప్రేమతో సహనంతో దేన్ని అయినా జయించవచ్చని పవన్ స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ గురువారం విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.