(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
బిజెపి దేశంలో అతి పెద్ద పార్టీ..! కానీ ఏపిలో ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు !! జనసేన ఏపిలో ప్రాంతీయ పార్టీలో చిన్న పార్టీ ! గడచిన ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు తెచ్చుకుంది. ఈ రెండు జత కడితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఈ ప్రశ్న పక్కకు పెడితే..ఏపిలోని 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టే సత్తా జనసేన పార్టీకి ఉంది. 175 నియోజకవర్గాల్లోనూ బూత్ స్థాయి కార్యకర్తలను, లక్షల మందిని పోగేసే సత్తా జనసేనకు ఉంది. బిజెపి తన అభ్యర్థులను నిలబెట్టాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుంది.
పొత్తుతో జనసేనకు ఓరిగేది ఏమిటి
సగానికిపైగా నియోజకవర్గాల్లో బిజెపికి బూత్ ఏజంట్లు కూడా ఆ పార్టీకి దొరకరు. ఈ రెండు పొత్తు పెట్టుకుంటే ఎవరికి లాభం? పవన్ కళ్యాణ్పై అవినీతి కేసులు లేవు బిజెపి చేతిలో ఉండటానికి. కానీ బిజెపితో జత కట్టారు. కలిసి నడుస్తున్నారు. కలిసి పోరాడుతున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఇప్పుడిప్పుడే జనసేన నాయకుల్లో కొంత మంది నాయకుల్లో, కార్యకర్తల్లో మొదలు అవుతున్న ఒ పెద్ద ప్రశ్నకు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం సమాధానం చెప్పలేకపోతున్నారట. ఆ పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ, పార్టీలో కొంత మంది నాయకుల మధ్య జరుగుతున్న చర్చ ప్రకారం చూస్తే బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు. బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు కలిగే ప్రయోజనం ఏమిటి? అనేది పెద్ద ప్రశ్నార్థకం అవుతున్నది. ఇటీవల ఆ రెండు పార్టీలు కలిసి చేసిన ఆందోళన బిజెపితో పొత్తు పెట్టుకున్న తరువాత పవన్ కళ్యాణ్ హిందూత్వ వాదనలు, మాటలు విన్న జనసేన కార్యకర్తలు కొంద మంది షాక్ కూడా గురి అవుతూ తమలో తాము ప్రశ్నంచుకుంటున్నారు.
ఒంటరి పోరాటమే మేలు
ఏ రాజకీయ పార్టీతో జత కట్టకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీకి మేలు అంటున్నారుట జనసైనికులు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీని వాడుకుని వదిలివేస్తాయని వారి భావన. ఉదాహరణకు 2014 ఎన్నికల్లో టీడీపీ విజయంలో జనసేన పాత్ర కూడా ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జనసైనికులను పట్టించుకోలేదని చెబుతున్నారు. బిజెపితో కలిసి పని చేస్తే అది ఆ పార్టీకి లాభిస్తుంది కానీ జనసేనకు ఒరిగేది ఏమీ ఉండదని జనసైనికుల భావనగా ఉందట. ఇటీవల జరిగిన అంతర్వేది ఘటనపై జరిగిన ఉమ్మడి నిరసన కార్యక్రమాల్లో తక్కువ సంఖ్యలో పాల్గొన్న బిజెపి నేతలు ముందు వరుసలో నిల్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్లారనీ జనసైనికులు ఉదాహరణగా చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎవరో తప్పుదోవ పట్టించి బిజెపితో కలిసి ప్రయాణం చేశారనీ ఆ పార్టీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జనసేనకు దూరమవుతున్న మైనార్టీ, దళిత క్రైస్తవులు
జనసేన పార్టీకి ఇంతకు ముందు కులాలకు, మతాలకు అతీతంగా ఉండటం వల్ల మైనార్టీ ముస్లింలు, దళిత క్రైస్తవులు మద్దతు తెలిపారనీ, ఇప్పుడు మతతత్వ పార్టీ బిజెపితో జత కట్టడంతో ఆ వర్గాలు జనసేనకు దూరం అయ్యాయని జనసైనికుల మనోగతంగా ఉందట. హిందూత్వ ఎజండాతో జనసేన ఎన్నికల్లోకి వెళితే తీవ్ర నష్టం జరుగుతుందని జనసైనికులు మధన పడుతున్నారుట. జనసైనికుల మనోభావాలను జనసేనాని తెలుసుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.