అమరావతి : మహాత్మా గాంధీ, నాధూరాం గాడ్సేను ఉద్దేశించి జనసేన పార్టీ నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని పవన్ స్పష్టత ఇచ్చారు. సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున దీనిపై స్పష్టత ఇస్తున్నట్టు తెలిపారు. మీడియా వేదికగా నాగబాబు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని అన్నారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయమేదైనా అధికారికంగానే ప్రకటిస్తామని అన్నారు. వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా కష్టకాలంలో … ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని సూచించారు.
జనసేన నాయకుడు నాగబాబు ఇటీవల గాడ్సేను ప్రశంసించే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ స్పందించి ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.