జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు వైసీపీపై, తన బస్సు యాత్ర పైన కీలక వ్యాఖ్యలు చేేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీ నుండి బస్సు యాత్ర ప్రారంభించాలని ముందుగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల అయ్యింది. కానీ బస్సు యాత్ర ను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పంతో బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ లోపుగా కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసేన లీగల్ సెల్ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్.. రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై జోస్యం చెప్పారు. ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47 నుండి 67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రజలకు, ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. హామీలను నెరవేర్చని అధికార పార్టీకి చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.
2019 ఎన్నికల్లో ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే వైసీపీకి ఓటువేశారో కానీ దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. 2014 ఎన్నికల్లో తాను గుడ్డిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదని చెప్పారు. రాజధాని విషయంలో ఆనాడే తన వైఖరి స్పష్టం చేశానని అన్నారు. భారీ స్థాయిలో వేల ఎకరాల్లో కాకుండా చిన్న రాజధాని ఏర్పాటు చేయాలని నాటి టీడీపీ ప్రభుత్వానికి సూచించానని చెప్పారు. కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 30వేల ఎకరాలు అవసరం అని చెప్పి అమరావతి లో రాజధానికి ఓకే చెప్పారన్నారు. చట్ట సభలో మాట ఇచ్చి వెనక్కి పోతే ఇక విలువ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, అమరావతిని అభివృద్ధి చేస్తానని అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మాట తప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో వివాదాన్ని రేపడంతో నేడు ఏపికి రాజధాని లేకుండా పోయిందన్నారు. తెలుగు రాష్ట్రాల ఆస్తుల పంపకంలో జగన్ కు శ్రద్ద లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అధికంగా ఉందని ఆరోపించారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో జనసేన పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వేగంగా అధికారాన్ని అందుకోవడం తమ లక్ష్యం కాదనీ పేర్కొన్న పవన్ కళ్యాణ్.. మహనీయుడు ఎన్టీఆర్ తో పోటీ పడలేమని, మార్పు కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. పార్టీలు నిలబడాలంటే బలమైన సిద్ధాంతాలు ఉండాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వదిలేసి పారిపోతారని చాలా మంది ఆశించారనీ, కానీ వారి కోరిక నెరవేరకుండా చేశానని చెప్పారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీలో కనీసం పది స్థానాలు వచ్చినా తమ పోరాటం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలని అన్నారు. జనసైనికులు పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేనకు బలమైన స్థానాలు గుర్తించి అక్కడ బాగా పని చేయాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగే అభ్యర్ధులను ఎంపిక చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
Read More: ఏపి రాష్ట్ర వ్యవస్థ బేషూగ్గా ఉన్నా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ మండిపాటు