అమరావతి: వైసిపి నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి నిప్పులు చెరిగారు. విడిపోయిన వాళ్ల జీవితాలపై మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం వారికి లేదని పవన్ మండిపడ్డారు. గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాము విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నామని అన్నారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని ఉద్దేశపూర్వకంగానే అన్నాననీ, ఈ వ్యాఖ్యలను మంత్రి బొత్స బాధపడిపోతున్నారని పవన్ విమర్శించారు. ముందు మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పండి అంటూ ఘాటుగా విమర్శించారు. విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడటానికి ఇంగితజ్ఞానం లేదా అంటూ మండిపడ్డారు. ‘మట్టిలో కలిసిపోతారు అనే మాటను నేను ఆవేశంలో అనలేదు, తెలుగుభాషను మీరు అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని మరో సారి చెబుతున్నా, మా పార్టీది భాషలను గౌరవించే సంప్రదాయం’ అని పవన్ అన్నారు.
‘పేరులో లేని పదాలను తనకు (పవన్ నాయుడుగా) ఆపాదించడం మానుకోవాలని హెచ్చరించారు. ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి మనకెవ్వరికీ ఛాయస్ లేదు కానీ ఎలా ప్రవర్తించాలో మన చేతిలోనే ఉంది’ అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిని పేరుతో సంభోదిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. జాతీయ మీడియా అంతా జగన్ రెడ్డి అనే సంభోదిస్తుందని, తాను అలా సంభోదిస్తే ఎందుకు తప్పుబడుతున్నారని ప్రశ్నించారు. ఆయనను ఏ విధంగా సంభోదించాలో వైసిపికి చెందిన 151 మంది తీర్మానం చేసి తెలియజేయాలని పవన్ కోరారు.
అవినీతిపైన రాజీలేని పోరాటం అంటే నవ్వుతారని తెలుసు, ఎప్పటికీ గెలవని పోరాటం అని తెలుసు కానీ ప్రయత్నం చేయాలన్నారు.