(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో, జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ క్రియాశీల కార్యకర్తలు, యువ జనసైనికుల నుండి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయన్నారు. యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు జీహెచ్ఎంసీలో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్దం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశామన్నారు పవన్ కళ్యాణ్.
తన వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులతో ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించామన్నారు. జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నందున వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని డివిజన్లలో జనసేన పోటీ చేయనున్నది. బీజెపీతో కలిసి పోటీ చేస్తున్నారా లేక జనసేన ఒంటరిగా పోటీ చేస్తున్నదా అనేది ప్రకటనలో పేర్కొనలేదు. బీజెపీ అనే మాట కూడా రాయలేదు. అంటే ఇప్పటి వరకూ జనసేనతో తెలంగాణ బీజెపీ నేతలు ఇంత వరకూ చర్చలు జరపలేదని అర్థం అవుతోంది. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజెపీ ఉమ్మడిగా పోటీ చేస్తుందనీ, ఇంకా ఎవరితోనూ పొత్తు లేదని అంటుండటం గమనార్హం. దీనిపై జనసేన నుండి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.