Janasena Party : జనసేన పార్టీ Janasena Party జనసైనికులు సినిమా మొదలెట్టాశారు. మిగిలింది రాజకీయ తెరపై పవన్ ప్రణాళికలే. వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందనేది నిర్వివాదాంశం. ఇక గమ్యం నిర్దేశించుకుని వేసే అడుగులో.. సంకల్ప బలం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం కాదు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఇదే వర్తిస్తుంది. అయితే.. అత్యంత క్లిష్టమైన సినిమా, రాజకీయ వైకుంఠపాళిలో పోటీ మరింత ఎక్కువగా ఉంటుంది.
నిచ్చెనలు ఉంటాయి.. పాములూ ఉంటాయి. పాము కాట్లను తప్పించుకుని నిచ్చెనలు ఎక్కుతూ వెళ్లాల్సి ఉంటుంది.. లేదా ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడిదే పని జనసన చేస్తోంది. అధినేత పవన్ కల్యాణ్ ను కూర్చోబెట్టి కాగల కార్యాన్ని నెరవేర్చే పనిని జనసైనికులే తీసుకున్నారు. ఇటివలి పంచాయతీ ఎన్నికల్లో జనసేన సాధిస్తున్న పంచాయితీలే ఇందుకు నిదర్శనం. పవన్ పై ఉన్న నమ్మకం.. ను గెలిపించాలనే వారి తపన ఆసక్తికరంగా మారింది.
జనసైనికులే.. అంతా తామే అయి..
జనసేన పార్టీని పవన్ కల్యాణ్ స్థాపించినప్పుడు ఉన్న ఉత్సాహమే పవన్ అభిమానుల్లో ఇప్పటికీ ఉంది. ఆ పార్టీలోకి వచ్చిన ఇతర నాయకులు.. ఆ పార్టీతోనే రాజకీయ పయనం ప్రారంభించిన వారు ఇప్పుడు పెద్దగా పవన్ తో లేరు. మధ్యలోనే వెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీకి సపోర్ట్ ఇచ్చినా వెన్నంటి ఉన్నవారు 2019లో జనసేన సొంతంగా పోటీ చేసినా లేకపోయారు. పైగా 2019 ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయంతో పవన్, జనసైనికులు తప్ప పెద్దగా ఎవరూ మిగల్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న జనసేనను పవన్ చూసి జనసైనికుల్లో కసి పెరిగింది. నాయకులతో కాదు.. తామే సైనికులై పార్టీని నిలబెట్టాలనే లక్ష్యంతో పవన్ పై నమ్మకంతో పని చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలకు కూడా కావల్సింది గ్రామస్థాయిలో బలం. అటువంటి బలాన్ని పంచాయతీ ఎన్నికల ద్వారా నిరూపించింది జనసేన. 2018 మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో.. 2019లో మరోసారి పవన్ తన ప్రసంగంలో.. ‘పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా.. అప్పుడు చూపిస్తాం మా పవర్’ అన్నారు. నిజంగానే పవర్ చూపించి పంచాయతీలు గెలుచుకోవడం వైసీపీ, టీడీపీలకు షాకిచ్చేదే.
పంచాయతీ ఎన్నికలు పెద్ద బూస్టప్..
నిజానికి.. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పెద్దగా జనసైనికులకు దిశా నిర్దేశం చేసింది కూడా ఏమీ లేదు. నూనుగు మీసాల యువకుల నుంచి పెద్ద వయసు వాళ్లు.. యువతుల నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకూ జనసేన తరపున జనసైనికులే పంచాయతీల్లో అభ్యర్ధులుగా నిలబెట్టారు. జనసేన జెండా, అజెండా.. పవన్ ఫొటోను వెనుకబెట్టుకుని ముందుకు వెళ్లారు. పార్టీల గుర్తులు పని చేయని ఈ ఎన్నికల్లో పవన్ నామస్మరణే ఈ విజయాన్ని కట్టబెట్టాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన 23 శాతం ఓటింగ్ సాధించిందని పవన్ కల్యాణ్ ప్రకటించారంటే ఈ విజయం జనసేనకు చాలా పెద్ద బూస్టప్ అని చెప్పాలి. కడప, చిత్తూరు, కుప్పం, అరకు, పశ్చిమగోదావరి.. ఇలా మొత్తంగా 270 పంచాయితీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కించుకుని, 1654 స్థానాల్లో జనసేన రెండో స్థానంలో నిలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. పవన్ చాలా పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే..
ఇక పవన్ చేయాల్సింది ఇదే..
ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య పవన్ దే. టీడీపీతో పొత్తు చాలా పెద్ద మైనస్. ఆ తర్వాత వామపక్షాలు, బీఎస్పీ.. ఇప్పుడు బీజేపీతో పొత్తు జనసేన సత్తాను కాస్త సన్నగిల్లేలా చేస్తున్నాయి. పవన్ బలంతో ఎన్నికలకు వెళ్దామని చూస్తున్న బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు తోడు లేదు. జనసేన సాధించిన విజయంలో ఒక్క శాతం కూడా బీజేపీ సొంతంగా సాధించలేదు. ఇదే విషయాన్ని తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా పవన్ వద్ద ప్రస్తావించిన జనసైనికు వాదన ఇప్పుడు నిజమైంది.
ఈ విషయంలో జనసైనికుల సమరోత్సాహాన్ని పవన్ సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది. జీహెచ్ఎంసీలో నామినేషన్లు ఉపసంహరించుకోండి.. ఈ ఒక్కసారికి నా మాట వినండి అన్నారు పవన్. ఇలాంటి పొరపాట్లు పవన్ పూర్తిగా తగ్గించుకోవాల్సి తరుణం వచ్చింది. గ్రామస్థాయిలో జనసేనకు ఉన్న పవర్ ప్రూవ్ అయింది కాబట్టి.. దీనిని మరింత పటిష్టపరచాలి. పట్టణాలు, నగరాల్లో జనసేనను బలంగా తీసుకెళ్లాలి. జనసైనికులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా పవన్ వ్యూహాలు ఉంటే జనసైనికులకు పవన్ ఏమీ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారనే డైలాగ్ లా.. జనసైనికులే పవన్ ని అందలం ఎక్కిస్తారు.