రాష్ట్ర రాజకీయాల్లో జేసీ సోదరుల పాత్ర ప్రత్యేకమైనది. జేసీ దివాకర్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి అనంతలో రాజకీయాన్ని శాసించగా.., జేసీ ప్రభాకర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అన్న నీడలో సాగారు. ఉన్నదీ ఉన్నట్టు.. ముక్కుసూటిగా మాట్లాడే ఈ సోదరులకు కొద్దీ నెలలుగా కష్టాలు పెరిగాయి. అధికార పార్టీలోకి రాలేక.., గత ప్రభుత్వంలో చేసిన పాపాలు కడుక్కోలేక.., ఆర్ధిక కష్టాలు ఎదుర్కోలేక ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇక టీడీపీలో సాగడం కష్టమే అని డిసైడ్ అయ్యారట. మంచి ముహూర్తం చూసుకుని.. మేడలో కండువా మార్చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం..!!
బీజేపీలోకి వెళ్ళడానికి ఒకే..! కానీ..!!
ఈ సోదరుల కష్టాలు తీరే మార్గం ఎంచుకున్నారు. బీజేపీలోకి వెళ్తే తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉన్నా.., వ్యాపారాలు బాగుంటాయని, అధికార పార్టీ ఒత్తిళ్లు తగ్గుంతాయని భావిస్తున్నారట. అందుకే సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ దారిలోనే మనసు ఎక్కడున్నా మనిషి మాత్రం బీజేపీలోకి చేరిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మొదటి దశ చర్చలు పూర్తయ్యాయి. బీజేపీ జాతీయ నేత సత్య కుమార్ తో ఢిల్లీలో ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు. సత్యకుమార్ ద్వారా తమ ప్రతిపాదనని అమిత్ షా వద్దకు పంపించారు. దివాకర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తే.., తమపై ఉన్న కేసులకు రాజకీయ సహకారం అందిస్తా అంటే బీజేపీలో చేరడానికి ఏ ఇబ్బంది లేదని జేసీ తేల్చి చెప్పారట.
బీజేపీ అంటే పెద్ద సాహసమే..!!
ఇక్కడ ఒక కీలక పాయింట్లు చెప్పుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా యాక్టీవ్ గా ఉన్న నాయకులు బీజేపీలోకి దూరడం అంటే పెద్ద సాహసమే. బీజేపీ గుర్తుతో పోటీ చేసి గెలవడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఈజీ కాదు. కానీ జేసీ సోదరులు ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ సాహసమే. పైగా వారి వారసులు జేసీ పవన్ రెడ్డి, జస్వంత్ రెడ్డిలు తొలి గెలుపు కోసం, రాజకీయ బాటలు కోసం ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతున్నారు. ఈ తరుణంలో బీజేపీలోకి వెళ్లడం అంటే వారికి రాజకీయ మనుగడ క్షేత్రస్థాయిలో తగ్గుతుంది. అందుకే ఈ కుటుంబం కాస్త లోతుగా ఆలోచనలో పడింది. టీడీపీలో ఉండలేకపోతుంది. జగన్ దగ్గరికి రానీయడం లేదు. వైసిపిలో చేరడానికి అంగీకరించడం లేదు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోడుగా ఉంటె.. తమకు ఈ వ్యాపార ఆర్ధిక కష్టాలు గట్టెక్కుతాయి అనేది వీరి ఆలోచన. ఇటీవల చంద్రబాబు పైనా.. ఆయన వైఖరిపైనా జేసీ దివాకర్ రెడ్డి కామెంట్లు టీడీపీలోనే అసంతృప్తిని పెంచుతున్నాయి. టీడీపీలో ఇమడడం జేసీకి కష్టంగా మారింది. రూ. వంద కోట్ల ఫైన్ పడిన సిమెంట్ కంపెనీని మూసేసారు. ఇది కడితే కానీ, ఓపెన్ చేసుకోలేరు. మరోవైపు ట్రావెల్స్ బస్సుల కేసు ఉంది. ఇవన్నీ చూసుకుని… రిలీఫ్ ఇవ్వగలిగితే.. పదవులు ఇస్తామంటే బీజేపీకి వెళ్ళడానికి ఏ అభ్యంతరం లేదని జేసీ వర్గీయులు చెప్పుకుంటున్న మాటలు.